“నీ కిదె పద్యము కొమ్మా”
అని చెప్పి పోయెను. వీరిరాకను గనిపెట్టియుండి నాలుగవవాఁడుగా వచ్చిన మనరామకృష్ణుఁడు—
“నా కీపచ్చడమె చాలు నయముగ నిమ్మా.”
అని పూర్తిచేయఁగా తిమ్మఁడు మాఱుపలుకనేరక సేలువ నిచ్చివేసెను. ఈకథవిని రాయలు నవ్వి తిమ్మనికి వేఱొకసేలువ నొసంగెనఁట.
ఒకనాఁడు కృష్ణదేవరాయలు తనమంత్రులతోడను, పండితులతోడను, కవులతోడను, మిత్రబృందముతోడను నిండోలగంబుండ నొకపండితుండు విచ్చేసి “రాజచంద్రమా నేఁ జదువఁబోవు పద్యమునకు సంపూర్ణముగా నర్థముఁజెప్ప భవదాస్థానస్థవిద్వత్కవులు ప్రార్థింపఁబడుచున్నారు”. అనెను. అప్పుడు రాజుగారు తనపండితమండలివంక దృష్టిఁ బఱపిరి. ఇదియేమో యసాధ్యవిషయము వచ్చినదని కవులందఱు నొకరిముఖము నొకరు చూచుకొనుచుండిరి. అంత రామకృష్ణకవి లేచి వచ్చినపండితునివంకఁ దిరిగి— “పండితమండనా! తమపద్యమునకు సంపూర్ణార్థమును జెప్ప మేము సిద్ధముగా నున్నాము. మేమడుగు పద్యమున కర్థముం జెప్ప సిద్ధముగా నున్నారా తమరు?” యని యడుగఁగా నతఁడు ‘వ్యవహారము పెడదిరిగిన’ దని నిశ్చయించుకొని యేరీతిని దప్పించుకొనుటకు వీలులేక యెట్టకేలకు సమ్మతిం జూపెను. తరువాత రామకృష్ణకవి “తమపద్యమును జదువుఁ” డని కోరఁగా నాపండితుఁడు చదివిన పద్యము—