అయినను రామకృష్ణుఁడు పరిహాసమునకుఁ జెప్పియేయుండునని యెల్లవారికిని దోఁపకమానదు.
వాకిటికావలియగు తిమ్మనికి రాజుగా రెప్పుడో యొక మంచిసేలువ నిచ్చిరఁట. దాని నతఁడు కప్పుకొని క్రుమ్మరుటఁజూచి, మన వికటకవి దానిపైఁ గన్ను వేసి, యెట్లైనను దానిని కాఁజేయవలయునని యూహఁజేసి, యుపాయము గుదుర్చుకొని యొకనాఁడుఁ తిమ్మనిఁ బిలిచి మెల్లఁగా నిట్లు బోధించెను. ఓయీ కృష్ణదేవరాయలవంటి మహారాజుగారి ద్వారపాలకుఁడవై, యొకపద్యమునైనను గృతినందకుండుట నాకిష్టములేదు. అనఁగా అయ్యా తగినంత బహుమానము నియ్యనిదే కవులు పద్యములు చెప్పుదురా యనెను. రామకృష్ణుఁడు తిమ్మా, నే నుపాయముఁ జెప్పెద వినుము ఒక్కొక్కకవి నొక్కొక్కచరణమువంతున నడిగితివేని సులభముగాఁ బదిపద్యములఁ గృతి నందఁగలవు. ఇంతకు వేఱొకయుపాయము లేదని చెప్పఁగా నతఁడు సంతోషించి, మఱునాఁ డుదయమున వాకిట నిలిచి మొదట వచ్చిన పెద్దన్నగారికిఁ దనకోర్కిని దెల్పఁగా నక్కవి నవ్వి, యిట్లొకచరణమును జెప్పి లోపలికిఁ బోయెను.
క. “వాకిటికావలితిమ్మా”
తర్వాత వచ్చిన భట్టుకవి నాశ్రయింపఁగా నాతఁడు—
“ప్రాకటమగు సుకవివరుల పాలిటిసొమ్మా”
అనుచరణమును వ్రాసియిచ్చిపోయెను. పిమ్మట వచ్చిన తిమ్మకవి కీసంగతిని విన్నవింపఁగా నతఁడు—