పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

చాటుపద్యరత్నాకరము

మహమ్మద్ భేక్ సాహెబు

ఇతఁ డొకచిన్నజమీనుదారుఁడు. ఇంచుకయుదారస్వభావముఁ గలవాఁడు. ఒకనాఁడు ప్రసంగవశమున నొకబ్రాహ్మణుఁడు— “పూర్వము, మల్కిభరామ్ ప్రభువు కవులను మిగుల నాదరించి కృతులనంది బహూకరించి తనపేరు జగమ్మున నిలుపుకొని చనెను. సాహేబుగారు! తమరును నవాబుప్రభువు లంతవారు గదా” యనెను. ఆమాటలకు సాహెబుగా రుబ్బి “ఇప్పు డెవరైన నాపైఁ బద్యమును వ్రాయుదురేని, నూటపదియాఱులు బహుమతి నొసంగెద” ననెను. కవి గాకపోయినను సమయస్ఫూర్తిగల యావిప్రుఁడు భాగతములోని యొకపద్యము చివరన సాహేబుగారిపేరు నీక్రిందిరీఁతిఁ దగిల్చి చదివి నూటపదియాఱు రూప్యములు గైకొనెను.

క. భిల్లీభల్లలులాయక
   భల్లుకఫణిఖడ్గగవయబలిముఖచమరీ
   ఝిల్లీహరిశరభకరికిరి
   మల్లాద్భుతకాకఘూక! మహమదుభేకా!

రావిళ్ళవారు

చ. ఎనయఁగ నెన్నిజన్మముల నేమిట నీశ్వరుఁ బూజఁ జేసిరో?
   మనసిజుఁ గన్నతల్లియును మల్లనృపాలునిఁ గన్నతల్లియున్
   దనరఁగ భోజుతల్లియును దానగుణుం డగు కర్ణుతల్లియున్
   ఘనుఁ డగురావిళాన్వయశిఖామణి శేషనృపాలుతల్లియున్.