పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయతరంగము

165

   మెరువడి విద్యలేక కడు మెచ్చఁడు మెచ్చక యీవి నీఁడయా
   సురగురునంతవానికిని జూపలిధర్ముని వేఁడఁబోయినన్.

శా. నే నాకాశతరంగిణిన్ ధరణిలో నీవెవ్వరే? నావుడున్
   నేనా! జూపలిధర్మభూవిభుని పాణిన్ బుట్టుదానాపగన్
   నీనాయంతర మేడ కేడ? యవులే నీవేడ నేనేడ పో
   నేనా యాచకుపాదజాతనటవే? నే దాతృహస్తోదితన్.

మల్కిభరామ్


ఈతఁడు తురుష్కప్రభువు. ఈతని సరియగు నామము మలిక్ ఇబ్రాహీమ్. ఈతను తురుష్కుఁడైనను తెలుఁగుభాషయందు రుచిగలవాఁడు. ఒకటిరెండు గ్రంథములనుఁగూడ కృతి నందెను. ఈతఁడు పదునారవశతాబ్దిలో నాంధ్రదేశమునకుఁ బ్రభువుగా నుండెను. ఈప్రభు వొకనాఁడు “ఆకుంటే, ఈకుంటే, మీకుంటే, మాకుంటే” యని సమస్య నొసంగఁగా నప్పు డచ్చటనే యుండిన యొకకవి యిట్లు పూరించెను.

క. ఆకుంటే వృక్షం బగు
   నీకుంటే లోభియౌను హీనాత్ముం డౌ
   మీకుంటే మా కిమ్మా
   మాకుంటే మేము రాము మల్కిభరామా!

సమస్యాపూరణమునకు సంతోషించి మల్కిభరామ్ ప్రభు వాకవికి బహుమాన మొసంగెనఁట.