పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

చాటుపద్యరత్నాకరము

   వన్నెఁ జెలువొంద విలసిల్లె వాసిరెడ్డి
   వేంకటాద్రీంద్రనామపృథ్వీవరుండు.

ఉ. అక్కడ వేంకటాద్రివిభు నద్భుతచర్యలు చూచి వచ్చి తా
   నిక్కడఁ గూర్చెఁ బండితుల నిద్దఱి లోపల వాసిరెడ్డి వా
   రెక్కడ...................................యుప్పలపాటిచోగిరా
   జెక్కడ నక్క యెక్కడ న దెక్కట నిర్జరలోక మెక్కడో?

వేంకటాద్రినాయఁడుగారి యాస్థానమునకు బుచ్చి వెంకన యనుకవి యొకగ్రంథమును వ్రాసికొనివచ్చెనఁట. ఆతని కులమున గొంచెము కళంకము గలవాఁడఁట. ఆవిషయమును కొంచెమెత్తి యాస్థానములోని యొకకవి ప్రభువుగారి యభిప్రాయము నిట్లు తెల్పెను.

గీ. కులమునఁ గళంకు కల దనుకొంచుఁ గొంకుఁ
   గేలిఁ గావించి కంకున కేలఁ గొంకుఁ
   గవనమున జంకు నీమీఁదఁ గాదు బొంకు
   బుధజనాటవ్యటన్యంకు బుచ్చివెంకు.

తరువాత వేఱొకకవి లేచి—

క. కొంకక తమరాడినయది
   బొం కేలగు వేంకటాద్రిభూపాలక యీ
   న్యంకేల వానికిం గల
   రంకే యిచ్చోట నిల్ప రసవంత మగున్.

అనెనఁట. దానికా కవి యిట్లు పలికెనఁట.