పుట:Chandamama 1948 01.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

"వింధ్యపర్వతాలలో గణభూతి అనే యక్షుడు శాపగ్రస్తుడై పిచ్చివాడల్లే తిరుగుతున్నాడు. పుష్పదంతుడు నర జన్మ మెత్తి ఆ గణభూతిని కలుసుకుని అతనికి ఈ కథలన్నీ చెప్పినట్టయితే పుష్పదంతుడికి శాపవిముక్తి అవుతుంది. గణభూతి తానువిన్న కథలన్నీ మాల్యవంతుడికి చెప్పినట్టయితే గణభూతికి శాపవిముక్తి కలుగుతుంది.మాల్యవంతుడు ఈ కథలనన్నిటినీ పుస్తకంగా రాస్తే అతని శాపం పోతుంది."

పార్వతి శాపం ప్రకారం పుష్పదంతుడు భూలోకంలో వరరుచిగా పుట్టాడు. మాల్యవంతుడు గుణాఢ్యుడుగా పుట్టాడు. వరరుచి వింధ్యపర్వతాలంతా వెతికి గణభూతిని పట్టుకుని తాను దొంగతనంగావిన్న కథలన్నీ అతనికి చెప్పేశాడు.శాపవిముక్తుడై కైలాసానికి తిరిగి వెళ్ళాడు.గణాభూతి ఈ కథలనే గుణాఢ్యుడికి చెప్పి తాను కూడా శాప విముక్తుడైనాడు. ఆతరువాత గుణాఢ్యుడు ఈ కథలన్నిటినీ తాటాకుల మీద రాసి ఆ పుస్తకానికి " కథాసరిత్సాగరం " అని పేరుపెట్టాడు. అతను కూడా శాపవిముక్తుడైనాడు.

ఈ కథలు మీకు కూడా వినాలనుందా? ఐతే వచ్చేనెలనించి ఒక్కొక్క కథచెబుతాను వినండి.