పుట:Chandamama 1948 01.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి ఏమని కోరిందంటే, మూడు లోకాలలోనూ ఎవ్వరూ యెన్నడూ వినని కథలు తనకు వినిపించమన్నది. శివుడు సరేనని, వాకిట నందిని కాపుంచి, యెవ్వరినీ లోపలికి రానివ్వవద్దని ఆజ్ఞాపించి పార్వతికి అనేక వందల కథలు చెప్ప నారంభించాడు.

శివుడిదగ్గిర కొలువుండే భూతప్రేతగణాలకు నాయకులలో ఒకడైన పుష్పదంతుడు ఈవిషయం పసికట్టి శివుడు కథలు చెప్పేచోటికి వచ్చాడు. లోపలికి పోవటానికి శివాజ్ఞలేదని నంది అడ్డగించాడు. పుష్పదంతుడు నేరుగా లోపలికి వెళ్ళలేక తుమ్మెదరూపం ధరించి నందికి తెలియకుండా లోపల ప్రవేశించి ఒక స్తంభం చాటునవుండి శివుడు పార్వతికి చెప్పిన కథలన్నీ విన్నాడు. ఆతరువాత ఇంటికివెళ్లి పుష్పదంతుడు తనువిన్న కథ లన్నిటినీ తన భార్య అయిన విజయకు చెప్పాడు.

మర్నాడు ఆ కథలనే విజయ ఇతరులకు చెప్పుతూవుండటం విని పార్వతీ దేవి పుష్పదంతుడి మోసం గ్రహించినదై, అతన్ని నరజన్మ మెత్తమని శపించింది. పుష్పదంతుడి పక్షాన మాల్యవంతుడనేవాడు వాదించడానికి రాగా పార్వతి మాల్యవంతుణ్ణికూడా నరజన్మ మెత్తమని శపించింది.

పుష్పదంత మాల్యవంతు లిద్దరూ పార్వతి పాదాలపైబడి తమకు శాపవిముక్తి అనుగ్రహించమన్నారు. చివరికి వారిమీద అనుగ్రహం కలిగినదై పార్వతి వారికి ఈవిధంగా చెప్పింది :