శ్రీ
-* చ మ త్కా ర ని దా న ము *-
ఈ గ్రంధము గుంటుపల్లి గోపాలకృష్ణకవి విరచితమగు నేకాశ్వాసముగలయది. ఇందు నర్సారావుపేట డివిజన్ డిఫ్యూటీ కలెక్టరు గారి సముఖమున దివాకరుని తిరుపతి కవీంద్ర కృతశతావధానకార్యంబు వర్ణింపఁబడినది. ఆసమయమంద చ్చటికి విచ్చేసినది తిరుపతి కవికుల సార్వభౌములొక్కరయినను తిరుపతి వెంకటకవులిరువురఱుగ, దెంచినట్లు వ్రాయఁబడినది. ఇందర్థానుస్వారాది లిపిదోషములు కొన్ని గలిగియున్నను వాని మన్నింపఁ బ్రార్ధించుచున్నవాఁడను. నాది ప్రధమ ప్రయత్న మగుటచే నిట్లువిన్నవించుచున్న వాఁడ. ఏతత్కవికృతమగు బుధజనహృదయాహ్లాదయమను సంవరణ చరిత్ర మా పత్రిక యందు ముద్రితమగుచున్న యది. ఈ కవిజీవితాదికములగూర్చి యీగ్రంధమందు ముందు వ్రాయఁబడును గాన యిందువిస్తరించ లేదు. తప్పులు క్షమించవలెను.
ఇట్లు విన్నవించు విధేయుడు,
పత్రికాధిపతి :- గుంటుపల్లి సోమయ్య,
చెన్నుపల్లె అగ్రహారం - గుంటూరు జిల్లా,
నర్సారావు పేట తాలూకా కొమ్మాలపాడు పోస్ట్
___________