పుట:Bobbili yuddam natakam.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

బొబ్బిలియుద్ధనాటకము.

హసేనాలి. - గోలకొండ నిజాముగారి యాజ్ఞ చేత ఉత్తరసర్కారుల పేష్కస్సులు వసూలుచేయుటకు వచ్చిన సర్వాధికారి బూసీదొరగారి దివాను హైదరుజంగు బహద్దరువారు పంపగా మేము మీకడకు వారిరాయబారము తెచ్చినారము. వారి సర్దారులలో మే మొకరము. మేము వచ్చినపని హైదరుజంగు బహద్దరు వారి ధోరణిగానే వినుండు. - "మీరు గోలకొండ నిజామువారికి ఏడుసంవత్సరముల పేష్కస్సును ఎగవేసినారు. విజయనగరమురాజుగారి తాలూకాలు దోఁచుకొనుట, ఊరులు తగులఁబెట్టుట, లోనగు నేరములు ఎన్నియో చేసియున్నారు.

రంగ. - [ఆత్మగతము] హా; ఏమి ప్రయోగము ! ఎంతపని చేసినాఁడు రాజు ! [ప్రకాశము] తత్వాత, తర్వాత?

హసేనాలి. - "మఱియు, మారాకను రాజు మీకు తెలిపినను 'నౌకరులబేటికి మేము రాము' అని మమ్ము తూల నాడినారు. పైగా మేము పంపిన ఫర్మానాను సరకు గొన్నవారు కారు.

రంగ. - [ఆత్మగతము] ఆహాహా ! ప్రయోగము విషమువలె ఎట్లు ఎక్కి పోయినది ! [ప్రకాశము] మఱి ?

హసేనాలి. - "అది యెల్ల నటుండ -

(ఉత్సాహ)-

              నేము వచ్చి కాచి యుండ, నీకు లెక్క లేదోకో ?
              దీమసాన నౌభ తడిచి ధిక్కరింతువా మమున్ ?
              హాము మాని, యీక్షణాన నాఁపి దాని, నీగడిన్
              జాములోన ఖాలి సేసి, సాగు కట్టువల్వతోన్, ౩౭

ఇట్లు చేయనిపక్షమున మరల సూర్యుఁ డుదయించులోపల, మీపుట్టకోటను మట్టిలో కలిపి, మీజాతము నెల్ల రూపుమాపెదము." ఇ దయ్యా తమకు హైదరుజంగు బహద్దరువారు పంపిన రాయబారము. మేము వచ్చినపని అయినది, మఱి మేము మరలెదము.

రంగ. - అయ్యా ! మామాటయు కొంచెమువిని మరలుఁడు.

          ఆ. సత్యవంతు లెపుడు సత్యదూరులఁగూడ
              సత్యవంతు లనుచు సమ్మతింత్రు;
              సత్యదూరు లన్న సత్యవంతులఁ గూడ
              సత్యదూరు లనుచు సంశయింత్రు ౩౮