పుట:Bobbili yuddam natakam.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాంకము.

స్థలకము: - రంగారాయనింగారి యాస్థాని.

[అంతట రంగారావు, వెంగళరావు, ధర్మారావు,

గుమాస్తాలు, వేగులు, పరివారంబును ప్రవేశింతురు.]

రంగారావు. - చెప్పుఁడు మాకన్నులారా, మీరు ఇంక నేమి కనిపెట్టి వచ్చితిరి?

వేగులు. - మహాప్రభో ! పాపారాయనింగారు వస్తే కనిపెట్టడానికి రాజాం దారిలో విడిసినాడు విజయరామరాజు ; తనదండంతా తనకాణ్ణే పెట్టుకొనున్నాడు. దానెంబణ్ణే హైదరుజంగుడేరా ; బూసీడేరా దానెంబణ్ణుంది. సిద్దీబిలాలున్ను కడమ గొప్పసర్దార్లున్ను దానెంబణ్ణే. మాలపిల్లికాణ్ణుంచి వరసగా కొండబోటు దాకా ఫిరంగీలబారు నిలిపినారు. దానికీ బుస్సీ డేరాకూ నడుమ మందు కొట్లు. ఊరి చుట్టూరా అడివిలాగ సిద్దీలని, ఫరంగీలని, బుడుతకీసులని, ఇంగిలీసులని, వళందులని, తురకలని, ముట్టడి నిలిపినారు. వారివారి సందుల్లో, వారివారి పడాళ్లు కుదురుకొని వున్నారు. పరాసుల దం డంతా ప్రెతివాడికిన్ని తుపాకీలు, సన్నీలు, కత్తి కఠారీ, బల్లెం బాకు ; గోలకొండ తురకదండులో ప్రెతివాడికి ఇవే గాక డాల్ తర్వార్, ఈటె ఇవిన్ని, విళ్లు ఊచలున్ను. రాజుదండులో విళ్లు ఊచలు లావు, తుపాకులు కొంచెం; బల్లెం బాకు ఈటె లావు. రాజు మన్నె సిబ్బందీని యుద్ధానికి పెట్టక చాకిరీకి పెట్టినాడు.

ప్రతీహారి. - [ప్రవేశించి] జయం జయం ఏలినవారికి. హైదరుజంగు బహద్దరు కాడినుంచి రాయబారి సర్దార్ హసేనాలిగారు వచ్చివున్నారు.

రంగ. - ధర్మారావూ. నీవు ఎదురు పోయి వారిని తోడ్కొనిరమ్ము.

ధర్మ. - చిత్తము. [అని ప్రతీహారితో నిష్క్రమించును.

రంగ. - (వేగులతో) మీరు మరలి పోయి ఇంక మే మయిన తెలిసికొని రండి.

వేగులు. - ఏలినవారియాజ్ఞ. [అని నిష్క్రమింతురు.

[అంతట హసేనాలిని తోడ్కొని ధర్మారావు ప్రవేశించును.]

ధర్మా. - వారే రంగారాయనివారు. తమరు ఇటు చెంతకు దయచేయవలయును.

హసేనాలి. - [సమీపించి] సలాము రంగారావు బహద్దరువారికి.

రంగ. - [లేచి] సలాము హసేనాలి సాహెబుగారికి. ఇట్లు కూర్చుండుఁడు. [అని కుర్చీని జూపును. మువ్వురు కూర్చుందురు.