పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్థనా భావాలు

1. ఈ లోకంలో మనం ఇటు నేలవైపు చూస్తూ నడవాలి. అటు పరలోకంవైపు చూస్తూగూడ నడవాలి, ఈ రెండు దృక్పథాలు ముఖ్యమే. ఈ లోకం యథార్థమైంది. ఈ మంటిపై జీవించినంతకాలం మనం ఇక్కడ కృషిచేయక తప్పదు. ఐనా ఈ ప్రపంచం శాశ్వతమైంది కాదు. శాశ్వతలోకం మరొకటుంది. కనుక మనం నిరంతరం దానివిూద దృష్టినిల్పి జీవించాలి. ఈలా ఇహపరాలమిూద దృష్టికలవాడే ఉత్తమ క్రైస్తవుడు. కాని నిత్యజీవితంలో ఈ ఇహపరాలను రెండింటినీ విలువతో చూడ్డం ఎంతమాత్రం సులభం కాదు. అధిక సంఖ్యాకులు ఇహాన్ని ప్రేమించి పరాన్ని అశ్రద్ధ చేస్తారు. స్వల్పసంఖ్యాకులు పరాన్ని ప్రేమించి ఇహాన్ని అశ్రద్ధ చేస్తారు. ఇవి రెండు అపమార్గాలే.

2. ఉత్తానక్రీస్తు దర్శనం కోసం నిరీక్షిస్తూండడమే క్రైస్తవ జీవిత సారాంశం. మనం ఆ క్రీస్తమిూద ఆశపెట్టుకొని జీవించేవాళ్ళం. మన బహుమతి అతనినుండే హెబ్రేయుల జాబు ఈ క్రీస్తునీ ఓడ లంగరుతో పోల్చింది - 6, 19. లంగరు వేసిన ఓడ కొట్టుకొనిపోక స్థిరంగా నిలుస్తుంది. అలాగే క్రీస్తుని నమ్మినవాళ్లు స్థిరంగా నిలుస్తారు. మనం ఓడమైతే అతడు మనకు లంగరు. మరణం, తీర్పు, ఉత్తరించే స్థలం మొదలైన మన కడగతులన్నీ కూడా ఉత్తాన క్రీస్తుమిూది నమ్మకంవల్లనే ఫలసిద్ధిని పొందుతాయి. మన అంత్యగతి అతడే.

ప్రశ్నలు

అధ్యాయం - 1

1. మరణం మనలను యాత్రిక దశనుండి శాశ్వతదశకు ఏలా తీసికొనిపోతుంది?
2. మరణం ఏలా పాపఫలితమౌతుందో వివరించండి.
3. "క్రీస్తు మరణం మన మరణాన్ని పూర్తిగా మార్చివేసింది" - ఎట్లో తెలియజేయండి.
4. గ్రెగోరీ భక్తుడు మృత్యువును చెరసాలలో ఉన్న వ్యక్తితోను, గర్భస్థ శిశువుతోను, కాయగా మారనున్న పిందెతోను పోల్చడంలో భావమేమిటి?