ధనికునికి చాల పసులమందలున్నాయి. పేదవానికి ఒక్కటే గొర్రెపిల్ల. అతడు ఆ గొర్రెపిల్లను అల్లారుమదుగా పెంచుకొనేవాడు. సరే, ఓ దినం ధనికుని యింటికి చుట్టమొచ్చాడు. అతడు తన పశువులన్నిటినీ భద్రంగా అట్టిపెట్టుకొని పేదవాని గొర్రెపిల్లను లాగుకొనివచ్చి చుట్టానికి విందు చేయించాడు-అని కథ ముగించాడు.
ఈ కథవిన్న దావీదుకి వొళ్ళు మండింది. అతడు కోపంతో ఆ థనికుడు పేదవాడికి నాల్గరెట్ల నష్టపరిహారం చెల్లించాలని అన్నాడు. మోషే ధర్మశాస్త్రమే పూర్వం ఈ నియమం చేసింది - నిర్ణ 22,1.
ఈ కథలో నాతాను ఉద్దేశించిన పేదవాడు అతని గొర్రెపిల్ల, వూరియా అతని భార్య బత్షెబాను. కనుక ప్రవక్త దావీదు జవాబునందుకొని అతనితో నేను చెప్పిన దుషుడైన ధనికుడవు నీవే సుమా! ప్రభువు ఈలా అంటున్నాడు. నీకు ఇందరు భార్యలు ఉన్నారు కదా! సౌలు చనిపోయినపుడు అతని భార్యలను కూడ నీ వశం జేసానుగదా! నీవు ఈ స్త్రీలందరితోను సుఖించవచ్చుకదా! అన్నెంపన్నెం ఎరుగని వూరియాను చంపించి అతని యాలిని నీ యాలిని చేసికొంటావా? ఈ దుర్మార్గానికిగాను నీకు రెండు శిక్షలు పడతాయి. నీవు వూరియా-మీదికి కత్తి యెత్తావు కనుక, కత్తి నీ కుటుంబాన్ని విడువదు. నీ కొడుకులు చాలమంది అంతఃకలహాలతో చస్తారు. నీవు వూరియా భార్యను చెరిచావు కనుక నీ భార్యలను నీ కుమారుడే చెరుస్తాడు అని చెప్పాడు.
దావీదు రాజు, న్యాయాధిపతి కూడ. దేశంలో న్యాయాన్ని కాపాడవలసిన రాజే ధర్నాన్ని చెరిస్తే ఇక దిక్కెక్కడిది? కంచే చేనుమేస్తే కాపేమి చేయగలడు? కనుక ప్రభువు దావీదుకి ఈ శిక్షలు విధించాడు.
పై శాపం ప్రకారం తర్వాత దావీదు కుటుంబంలో అంతఃకలహాలు చెలరేగాయి. ప్రవక్త నుడివినట్లుగా అతడు నాల్గవంతులు నష్టపరిహారం చెల్లించవలసి వచ్చింది. బత్షెబాకు దావీదు వలన కలిగిన మొదటిబిడ్డడు పరిటిలోనే పోయాడు. దావీదు కుమారులు అమ్మోను, అబ్షాలోము, అదోనియా శత్రువుల వాతబడి దారుణమైన చావు చచ్చారు. ఇంకా, అబ్షాలోము తండ్రిమీద పగబట్టి పట్టపగలే, అందరూ చూస్తుండగానే తండ్రి భార్యలను చెరిచాడు - 16,22. నాతాను ప్రవచనం ఈలా నెరవేరింది.
ఇక్కడ నాతాను చెప్పిన పేదవాని గొర్రెపిల్ల అనే కథ బైబుల్లోని ప్రశస్తకథల్లో వొకటి. అన్యాపదేశంగా వుండే ఈ కథ నేటికీ మనకు ప్రేరణం పట్టిస్తుంది. ప్రవక్తలు మాటనేర్పరులు.
దావీదు నాతాను పలుకులన్నీ సావధానంగా విన్నాడు. పూర్వం చాలమంది 'దుష్టరాజులు ప్రవక్తలకు ఎదురుతిరిగారు. వాళ్ళ నోళ్ళ మూయింపజూచారు. కాని దావీదు