4. శిరస్సుతో ఐక్యమైనవాళ్ల అవయవాలతో గూడ
పూర్వవేద ప్రజకు ఆదాము శిరస్సు, నూత్నవేద ప్రజకు రెండవ ఆదామైన క్రీస్తు శిరస్సు. జ్ఞానస్నాన సత్రసాదాల ద్వారా మనం అతనితో ఐక్యమౌతాం. అతడు మనలనందరినీ తన అవయవాలుగా తనలో యిముడ్చుకొంటాడు. కాని దేహంలోని అవయవాలన్నిటికీ పరస్పర సంబంధం వున్నట్లే క్రీస్తులోనికి ఐక్యమైన వాళ్ళందరికీ పరస్పర సంబంధం వుంటుంది. అతని అవయవాలమైన మనమూ తోడి ప్రజలూ అందరమూ కలసి పరస్పర ప్రేమభావంతో జీవించాలి. ఈ సందర్భంలో సిరిల్ భక్తుని వాక్యాలను గుర్తుకి తెచ్చుకోవాలి. “మనం భిన్న వ్యక్తులంగా వుంటాం. కాని క్రీస్తుద్వారా ఒక్క శరీరం, ఒక్క సమాజం ఔతాం. అతని శరీరాన్ని భుజించి అతని ఆత్మను పొందినపుడు ఈ ఐక్యత ప్రాప్తిస్తుంది. క్రీస్తు ఒక్కడే చాల మందిమైన మనం అతనియందు ఒక్కటిగా ఒనగూడుతాం. కనుకనే అతడు పిత నుద్దేశించి తండ్రీ! మనం ఒక్కటియైనట్లుగా వీళ్ళూ ఒక్కటి కావాలని ప్రార్థించాడు." ఇంకా క్రిసోస్తం భక్తుడు కూడ ఈలా నుడివాడు. "శిరస్సుతో ఐక్యమైన అవయవాలన్నీ దానితో కలసి ఒక్క దేహమౌతాయి. అలాగే క్రీస్తుతో కలసిపోయిన మనంకూడ ఒక్క దేహమూ ఒక్కసమాజమూ ఔతాం."
ఈలా క్రీస్తుని భుజించడం ద్వారా మనకు తోడి ప్రజలతో ఐక్యత చేకూరుతుంది. ఈ సందర్భంలో "దివ్యసత్రసాదం శ్రీసభను నిర్మిస్తుంది" అనే ప్రాచీన సూత్రాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. దివ్యభోజనం శ్రీసభను నిర్మిస్తుంది, దాన్ని పెంపుకు తెస్తుంది. ఏలా? శ్రీసభకు ఐకత్యనూ ప్రేమభావాన్నీ ప్రసాదించడం ద్వారా క్రైస్తవులు పరస్పర ప్రేమభావంతో జీవించినపుడు తప్పక అభివృద్ధి చెందుతారు గదా! ఓ వైపు శ్రీసభ సత్ర్పసాదాన్ని తయారుచేస్తుంది. మరోవైపు ఆ భోజనం శ్రీసభను పెంపొందిస్తుంది. కనుకనే అగస్తీను భక్తుడు కూడ"సంస్కారరూపమైన శరీరాన్నిభుజించేవాళ్ళ శ్రీసభ రూపమైన శరీరమౌతారు" అన్నాడు. అనగా దివ్యసత్ర్పసాదాన్ని భుజించేవాళ్ళు శ్రీసభ సభ్యులై దాన్ని వృద్ధిలోకి తీసికొని వస్తారని భావం.
క్రీస్తుతో ఐక్యంగావడం ద్వారా మనం శ్రీసభతో ఐక్యమౌతాం. కాని శ్రీసభతో ఐక్యంగావడం ద్వారా క్రీస్తుతో ఐక్యం గావడం గూడ జరుగుతుంది. మనం జ్ఞానస్నానం ద్వారా, దివ్యసత్రసాదం ద్వారా శ్రీసభలో సభ్యులమైనపుడు ఆ ప్రభువు మన హృదయాలను తన సాన్నిధ్యంతో నింపుతాడు. మనలను తనతో సన్నిహితంగా ఐక్యపరచుకొంటాడు. ఒకవిధంగా చెప్పాలంటే ఈ భోజనం మనలను క్రీస్తుతో కంటె గూడ తోడిజనంతో ఎక్కువగా ఐక్యపరుస్తుంది. అందుకే తోమాసు అక్వినాసు భక్తుడు ఈ సంస్కారం ద్వారా