పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. "నేనర్పించే బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే" అన్నాడు భక్తుడు. చాలమందికి మతమంటే వట్టి కర్మకాండ, తంతు. కాని పశ్చాత్తాపతప్తమైన హృదయాన్ని అర్పించుకోవడం నిజమైన బలి, నిజమైన మతం. క్రీస్తుకూడ హృదయ నైర్మల్యాన్ని కోరాడు. హృదయం నుండి దురాలోచనలు పుట్టి మనిషిని మలినపరుస్తాయి. కనుక హృదయాన్ని నిర్మలంగా ఉంచుకోవడం నిజమైన భక్తి - మత్త 15, 19–20. పశ్చాత్తాపపూరితమైన హృదయంతో దేవుని సన్నిధిలోనికి రావాలని చెప్పడంద్వారా కీర్తనకారుడు నూత్నవేదం బోధించే నైతిక బోధలకు చాల చేరువలోకి వచ్చాడు. ఐతే నేడు, మన హృదయాలు ఎంత నిర్మలంగా ఉంటాయి? మనం పశ్చాత్తాపానికి ఎంత విలువ నిస్తుంటాం?

4. పాపం వలన దేవునికీ మనకూ వుండే సంబంధం తెగిపోతుంది. పశ్చాత్తాపం ద్వారా ఈ సంబంధాన్ని పునరుద్ధరించుకొంటాం. శ్రీసభలో ప్రధానమైన పశ్చాత్తాపం పాపసంకీర్తనమే. ఈ కీర్తనకారునికి ఈ సంస్కారాన్ని గూర్చి తెలియదు. దీనిద్వారా మనం సృష్టివస్తువులనుండి వైదొలగి దేవుని దగ్గరికి వస్తాం. అతనితో ఐక్యమౌతాం. కనుక ఈ సంస్కారాన్ని మనం భక్తితో స్వీకరిస్తుండాలి. దాన్నిగూడ ఓ కర్మకాండను చేయకూడదు. పాపోచ్చారణ సందర్భంలో ఈ కీర్తనను భక్తితో జపిస్తే మన పశ్చాత్తాపం ఇంకా పునీతమౌతుంది.

5. ప్రభువు మన పాపాలను మన్నించినపుడు మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఈ కీర్తనలో భక్తుడు రెండుసార్లు ఈ యానందాన్ని పేర్కొన్నాడు (8,12) ఉత్తాన క్రీస్తు మన పాపాలను మన్నించి మనకు ఆనందమూ శాంతీ దయ చేస్తాడు. కనుకనే అతడు శిష్యులకు దర్శనమిచ్చినపుడెల్లా మీకు శాంతి కలుగునుగాక అని చెపూండేవాడు - యోహా 20, 26.

6. దేవుడు చిత్తశుద్ధిని కోరేవాడు (6). ఈ కీర్తన కారునిలో ఈ గుణం సమృద్ధిగా ఉంది. అతని కీర్తనే దీనికి తార్కణం. ఐతే, ఈ గుణం మనలో ఎంతవరకుంది?

కీర్తన - 113

మహోన్నతుడూ కరుణామయుడూ ఐన ప్రభువు

1. మీరు ప్రభువును స్తుతింపుడు

  ప్రభువు సేవకులారా! ప్రభుని స్తుతింపుడు 
  అతని నామమును సన్నుతింపుడు 

2. ప్రభుని నామము

  ఇప్పడును ఎప్పడును స్తుతింపబడునుగాక