కీర్తనల గ్రంథం మొదట యూదుల పాటల పుస్తకం. తర్వాత సమాజం గూడ దాన్ని తన పాటల పుస్తకం చేసికొంది.
6. కీర్తనకారుల భగవదనుభూతి
చాల కీర్తనలు గొప్ప భగవదనుభూతిని తెలియజేస్తాయి. హీబ్రూ కవులకు గాఢమైన విశ్వాసం వుండేది. వాళ్ళ ఆయా అవసరాల్లో ఆపదల్లో భగవంతుడు తమ్ము ఆదుకొన్న తీరునూ ఆ ప్రభువు కరుణనూ పదేపదే మననం చేసికొని గాఢమైన భగవదనుభూతిని పొందారు. ఆయనుభూతినే పాటలుగా వ్రాసారు. తర్వాత ఆ పాటలను భక్తులు ఎన్నోసార్లు దేవళంలో పాడుతూ వచ్చారు. కీర్తనకారులు అనుభూతులు కొన్ని:
ప్రభూ! దప్పిగొనిన దుప్పి సెలయేటి నీటికొరకువలె
నా హృదయం నీ కొరకు తపిస్తూంది–42,1
స్వర్గంలో మాత్రం నీవు దప్ప నాకిం కెవరున్నారు?
ఈభూమిమీద నీవుదప్ప మరొకటి నాకు రుచించదు - 73, 25
ప్రభువే నాకు కాపరి, యిక యే కొదవా లేదు - 23,1
భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా వుంటుందో
ప్రభువుపట్ల భయభక్తులు చూపేవారి యెడల
అతని ప్రేమ అంత మిక్కుటంగా వుంటుంది - 103,11
తల్లిదండ్రులు నన్ను విడనాడినా
ప్రభువు నన్ను చేరదీసి పరామర్శిస్తాడు - 27,10
నేడు మనం కూడ ఈ పాటలనుండి భగవదనుభూతిని సాధించే విధానం నేర్చుకోవచ్చు. ఈ దృష్టితో జూస్తే ఈ గీతాలు చాల విలువైనవి.
7. కీర్తనలు, క్రైస్తవ ప్రార్ధనం
నూత్నవేదంలో పూర్వవేదం నుండి 360 ఉద్ధరణలు ఉన్నాయి. వీటిల్లో మూడవవంతును కీర్తనల గ్రంథం నుండే ఉదాహరించారు. ఈ యదాహరణలు తరచుగా క్రీస్తునుసూచిస్తుంటాయి. కీర్తనల్లో మెస్సియాను గూర్చిన గీతాలు నేరుగా క్రీస్తుకే అన్వయిస్తాయి.మిగతా కీర్తనలుగూడ చాలవరకు క్రీస్తుని సూచిస్తాయి. క్రీస్తుకి అన్వయించందే ఈ గీతాలకుఫలసిద్ధి లేదు. పైగా క్రీస్తు స్వయంగా వీటిని జపించాడు కూడ. ఉదాహరణకు "నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచావు" అనే 22, 1 కీర్తన వాక్యాన్ని ప్రభువు సిలువమీద