5. అంత్యభోజనము నేటి పూజబలి
అంత్యభోజనానికీ కల్వరిమీది సిల్వబలికీ గల సంబంధం చూచాం. కాని ఆ భోజనానికీ నేటి పూజబలికీ గల సంబంధం ఏమిటి? ఆ అంత్యభోజనాన్నే ఈనాడు మనం పూజగా కొనసాగించుకొంటున్నాం. అది సూచించిన కల్వరి బలినే నేడు మన పూజ కూడ సూచిస్తుంది. ఈ రెండింటి విలువ ఆ కల్వరి బలిని బట్టే వచ్చింది.
ఐనా కడపటి విందుకీ నేటి పూజకీ ఈ క్రింది వ్యత్యాసాలు వున్నాయి.
1. నాటి కడపటి భోజనం భవిష్యత్తులో జరగబోయే సిలువబలిని సూచించింది. నేటి పూజబలి భూతకాలంలో జరిగిపోయిన సిలువబలిని సూచిస్తుంది. 2. ఆ కడపటి విందులో ఆత్మార్పణం కావించుకోబోయే బలిమూర్తి ప్రత్యక్షమయ్యాడు. నేటి పూజబలిలో ఆత్మార్పణం కావించుకొని ఉత్తానుడై మహిమను పొందిన బలిమూర్తి ప్రత్యక్షమౌతాడు. 3. ఆ మొదటి విందులో క్రీస్తు తన్ను తానే తండ్రికి అర్పించుకొన్నాడు. నేటి పూజబలిలో అతడు గురువుద్వారాగాని తన్ను తాను తండ్రికి అర్పించుకోడు. ఈలాంటి అంతర్గత వ్యత్యాసాలు కొన్ని వున్నాయి. ఐనా వరప్రసాద లాభాన్ని గూర్చి చెప్పవలసి వస్తే మాత్రం ఆ కడపటి విందుకీ నేటి పూజకీ వ్యత్యాసం లేదు. అది ఎంతఫలితాన్ని యిచ్చిందో నేటి పూజ కూడ అంత ఫలితాన్ని యిస్తుంది.
ప్రార్థనాభావాలు
1. పూర్వవేదంలోని మెల్మీసెడెక్కు క్రీస్తుకి సంకేతంగా వుంటాడు. ఇతడు రాజూ యాజకుడూనూ. ఇతడు రొట్టె ద్రాక్షసారాయాలను అర్పించాడు. ఇతనికి ప్రతిబింబమైన క్రీస్తు కూడ దేవునికి ఇవే కానుకలు అర్పించాడు. కనుక క్రీస్తు మనకు నూత్న మెల్కీ డెసెక్కు లాంటివాడు - హెబ్రె 5,10. కీర్త 110,4
2. ఏప్రేము భక్తుడు ఈలా వ్రాసాడు. "పూర్వవేదం లోని యాజకుల వలనా బలుల వలనా దేవునికి సంతుష్టి కలుగదని తెలిసి క్రీస్తు యాజకుడు తానే స్వయంగా బలిపశువయ్యాడు. అలా మన యాజకుడు స్వయంగా బలిపశువై తన్ను తానే తండ్రికి ఆత్మార్పణం చేసికొన్నాడు. ఈ యర్పణం పూర్వవేదపు బల్యర్పణాలన్నిటినీ మించిపోయి తండ్రికి ప్రీతి కలిగించింది. ఈనాడు మన కందరికి ఆదరువుగా వుండేది ఈ బలిమూర్తియైన క్రీస్తే."
3. శ్రీ సభ ఆరాధనా క్రైస్తవ జీవితమూ కూడ పూజ బలిలో పరాకాష్ఠనందుకొంటాయని చెప్తుంది రెండవ వాటికన్ మహాసభ, కనుక యోగ్యంగా పూజబలిలో పాల్గొనడం