పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యోవేలు ప్రవచనం ప్రకారం నూత్నవేదంలో అందరూ ఆత్మను పొంది ప్రవక్త లౌతారు -2, 28-32. ఆత్మ దిగివచ్చాక పేత్రుతాను యెరూషలేములో చేసిన మొదటి ప్రసంగంలో ఈ ప్రవక్త వాక్యాలను ఉదాహరించాడు - అచ 2, 17-18. అతడు ఆత్మవాగ్హానం అపోస్తలులకు మాత్రమే కాక విశ్వాసులమైన మనకుకూడ లభిస్తుందని చెప్పాడు – అచ 2, 38. ఈ వాక్యాలప్రకారం ఈనాడు మనంకూడ భద్రమైన అభ్యంగనంలో ఆత్మను పొంది ప్రవక్తలమౌతాం. ప్రవక్త అనగానే భవిష్యత్తునుగూర్చి చెప్పేవాడు అనుకొంటాం. ఇది పొరపాటు. ప్రవక్త ప్రధానంగా దేవుని తరపున మాటలాడేవాడు. దేవుని సందేశాన్ని ప్రజలకువిన్పించి అతనికి సాక్ష్యంగా నిల్చేవాడు. ఈయర్గాన్ని తీసికొంటే మనమందరమూ ప్రవక్తలమే. ఈలా ప్రభువు ప్రవక్తలమయ్యే భాగ్యం ఈ ప్రత్యేక సంస్కారం ద్వారా పొందుతాం.

ప్రార్థనాభావాలు

1. గృహస్తుల ప్రేషితోద్యమాన్ని గూర్చిన వాటికన్ చట్టం ఈలా చెప్తుంది. "మనకు శిరస్పయిన క్రీస్తునుండే గృహస్థలు ప్రేషితోద్యమంలో పాల్గొనేహక్కుపొందుతారు. జ్ఞానస్నానం ద్వారా వీళ్లు క్రీస్తు జ్ఞానశరీరమైన తిరుసభతో ఐక్యమౌతారు. భద్రమైన అభ్యంగనం ద్వారా ఆత్మనుండి బలాన్ని పొందుతారు. క్రీస్తే వీళ్ళకు ప్రేషితకార్యాన్ని ఒప్పగిస్తాడు. పై సంస్కారాల ద్వారా గృహస్తులు పవిత్ర ప్రజా, యాజకులూ ఐ ఆధ్యాత్మికమైన బలులర్పిస్తారు. లోకమంతటా క్రీస్తుకి సాక్ష్యంగా వుంటారు" -3.

పై వాక్యాల ప్రకారం జ్ఞానస్నానమూ భద్రమైన అభ్యంగనమూ స్వీకరించిన వాళ్ళంతా ప్రేషితులౌతారు, కావాలి. కనుక మతసేవంతా గురువులూ మఠకన్యలూ చేసికొంటారులే అనుకొని గృహస్థలు మెదలకుండా వండిపోకూడదు. తమకు చేతనైన సేవ తాముకూడ చేయాలి.

2. మనది హిందూమత ప్రాధాన్యంకల దేశం. క్రైస్తవులమైన మనం మైనారిటీ వర్గానిమి. మన పూర్వనాయకులైన గాంధీ నెహ్రూ మొదలైనవాళ్ల గొప్ప మతసహనం కలవాళ్ళు ప్రస్తుతపు నేతలకు ఈ సహనం తక్కువ. హిందూ సమాజంలో ఆర్.ఎస్.ఎస్. లాంటి తీవ్రశాఖలున్నాయి. వీళ్లు హిందూ దేశం హిందూ మతస్తులకు మాత్రమే అనే భావాలను ప్రచారం చేస్తున్నారు. హింసకూ దౌర్జన్యానికీ పూనుకొని అన్యమతాల వాళ్ళను బాధించడం మొదలిడుతున్నారు. ఈ పరిస్థితులు తీవ్రరూపం తాల్చవచ్చుగూడ, ఈలాంటి వాతావరణలో మనం క్రీస్తుకీ, ఆ ప్రభువు నేర్పిన ప్రేమ శాంతి అహింసలకు సాక్షులంగా నిలువగలిగి వుండాలి.