ఆ మోక్షంలో అతడు తండ్రి కుడి ప్రక్కన కూర్చున్నాడు - మార్కు 16,19. బైబుల్లో "కూర్చోవడం" పని పూర్తయిందని తెలియజేస్తుంది. ఇక్కడ క్రీస్తు రక్షణకార్యాన్ని పూర్తిచేసాడని భావం, క్రీస్తు తండ్రి "కుడి ప్రక్కన" కూర్చున్నాడు అంటే ఆ తండ్రి మహిమలో పాలుపొందాడని భావం. పూర్వం అతడు వినయంతో బానిసరూపం చేకొన్నాడు. నీచమైన సిలువ మరణం అనుభవించాడు. అందుకుగాను ఇప్పడు కీర్తిని పొందాడు. తండ్రితో పాటు తానూ రాజ్యపాలనం చేస్తాడు.
2. కొత్త సాన్నిధ్యం
క్రీస్తు నలభై రోజులపాటు శిష్యులకు కన్పిస్తూవచ్చాడు అన్నాం. ఈ కాలంలో వాళ్ళ క్రీస్తు ఎడబాటుకి అలవాటు పడ్డారు. ఆ పిమ్మట ప్రభువు మోక్షారోహణం చేయగా అతని సాన్నిధ్యం వాళ్ళనుండి పూర్తిగా వైదొలగింది. ఇక క్రీస్తు శారీరకంగా శిష్యులకు కన్పించడు. ఐనా క్రీస్తు భౌతిక సాన్నిధ్యానికి మారుగా ఆధ్యాత్మిక సాన్నిధ్యం ప్రారంభమైంది. అనగా అతడు ఆత్మద్వారా శిష్యులతో నివసించడం మొదలెట్టాడు. ప్రభువు ఈ యాత్మనుగూర్చి శిష్యులకు ముందుగానే తెలియజేసాడు. తండ్రిచెంతనుండి తనకు బదులుగా మరో ఆదరణకర్తను పంపుతానని చెప్పాడు - యోహా 14,16. తాను వెళ్ళిన పిదపనేగాని ఆ యాదరణకర్త రాడన్నాడు - 16,7. ఈ యాదరణకర్త క్రీస్తు మోక్షారోహణం చేసిన పిదప శిష్యులమీదికి దిగివచ్చాడు. ఇకమీదట క్రీస్తు ఈ యాత్మద్వారా శిష్యులకు ప్రత్యక్షమౌతాడు. ప్రభువు లోకాంతము వరకు శిష్యులతో వుంటానని మాట యిచ్చాడు కదా? - మత్త 28,20. ఏలా వుంటాడు? పరిశుద్దాత్మద్వారానే. శారీరక రూపంలో గాదు. వరప్రసాద రూపంలో ఆయాత్మక్రీస్తుని శిష్యులకు అందిస్తుంది. ఇప్పడు శ్రీసభలో క్రీస్తు ప్రత్యక్షమైయుండేదికూడ ఆ యాత్మద్వారానే.
క్రీస్తు మనలను అనాథులనుగా వదిలివేయనన్నాడు - యోహా 14,18. అతడు మన చెంతకు వచ్చినపుడు తండ్రిని విడనాడలేదు. అలాగే మోక్షారోహణమై మరల తండ్రి చెంతకు వెళ్ళినపుడు మనలను విడనాడడు. తన ఆత్మద్వారా మనకు ప్రత్యక్షమౌతుంటాడు.
3. క్రీస్తు మహిమ మన మహిమ
క్రీస్తు బానిస రూపాన్ని స్వీకరించి క్షుద్రమైన సిలువ మీద చనిపోయాడు. కనుక తండ్రి క్రీస్తు వినయానికి మెచ్చుకొని అతనికి ఉత్తానాన్ని ప్రసాదించాడు. అతన్ని ఆరోహణంచేసి తన చెంతకు చేర్చుకొన్నాడ. ప్రభువు అనే అతని సొంత నామాన్నే