పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రీస్తు ఈ తావుకి వెళ్ళి అక్కడవున్నపిశాచాలకు తన విజయాన్ని ఎరుకపరచాడు. వాటి పతనాన్ని వాటికి తెలియజేసాడు. పిశాచాల ఓటమి పాతాళ సందర్శనంలో ఓ ముఖ్యాంశం.

రెండవది, క్రీస్తు పాతాళ సందర్శనం అతని ఉత్తానాన్నిగూడ తెలియజేస్తుంది. పిశాచ ఖండనం ముగిసిన వెంటనే ప్రభువు ఉత్తానమై తండ్రిని చేరుకొన్నాడు. అతడు పాతాళానికి వెళ్ళినపుడు ఎంత దైన్యస్థితికి దిగజారిపోయాడో, మల్లా తండ్రిని చేరుకొన్నపుడు అంత ఉచ్ఛస్థితిని పొందాడు.

పేత్రు మొదటి జాబు జ్ఞానస్నానాన్ని పురస్కరించుకొని వ్రాయబడింది. జ్ఞానస్నానంలో క్రీస్తు మరజోత్థానాలు మనమీద సోకుతాయి. పిశాచంమీద క్రీస్తు సాధించిన విజయంకూడ ఈ పుణ్యక్రియలో మనకు సంక్రమిస్తుంది. ఈ భావాలను వివరించడానికే రచయిత ఈ జాబు వ్రాసాడు. ఇక, క్రీస్తు పాతాళ సందర్శనం అతని మరణిత్తానాలను సూచిస్తుందనే భావం, అతడు పిశాచాలమీద విజయం సాధించాడనే భావం, ఈ మొదటి పేత్రు జాబుని వ్రాసిన రచయిత భావాలకు సరిపోతాయి.

ఫలితార్థమేమిటంటే, క్రీస్తు పాతాళంలో బోధచేసిన ఆత్మలు పిశాచాలు కాని పితరులు కాదు. అతని బోధ పిశాచాల ఓటమిని వాటికి తెలియజేయడమే. క్రీస్తు పాతాళంలో ప్రత్యేక రక్షణకార్యమేమీ నిర్వహించలేదు. పాతాళ సందర్శనం అతని మరణంలో ఓభాగం అంతే. యూదుల పరిభాషలో ఆ సంఘటన అతని మరణోత్థానాలను సూచిస్తుంది

5. క్రీస్తు మరణ ఫలితాలు

బైబులు క్రీస్తు మరణ ఫలితాలను పలువిధాలుగా వర్ణిస్తుంది.

1. విమోచనం. యూదుల్లో ఎవడైనా పేదవాడయి బానిసగా అమ్ముడు పోయినట్లయితే అతని దగ్గరి చుట్టం డబ్బు చెల్లించి అతన్ని బానిసంనుండి విడిపించేవాడు. ఈలా విడిపించడాన్నే "విమోచనం" అన్నారు — లేవీ 25,47-49. ఇక ఐగుప్తలో యూదులు ఫరో చక్రవర్తికి బానిసలై వెట్టిచాకిరి చేస్తున్నారు. యావే ప్రభువు వాళ్ళ శ్రమలుచూచి వాళ్ళకోప తీసికొన్నాడు. తాను వాళ్ళకు దగ్గరి చుట్టమయ్యాడు. వాళ్ళను ఫరో దాస్యాన్నుండి విడిపించుకొని వచ్చాడు. ఇది పూర్వవేద విమోచనం. నూత్నవేదంలో మనం ఫరోకుగాక పిశాచానికి బానిసలమయ్యాం. క్రీస్తు మనకు దగ్గిర చుట్టమయ్యాడు. తాను సిలువమీద చనిపోయి పిశాచ దాస్యంనుండి మనలను విడిపించాడు. అనగా మన పాపాలు పరిహరించాడు, ఇది నూత్నవేద విమోచనం.