అద్భుత శక్తులు ప్రసాదిస్తాడని నమ్మారు. యావేశక్తిమీద అపనమ్మకం గూడ చెందారు. ఇది పిశాచం వాళ్ళను శోధించిన తీరు.
ఈలాంటి శోధన్నే దయ్యం క్రీస్తుకికూడ కలిగించింది. తన్ను ఆరాధిస్తే అతనికి అధికారం కైవసమాతుందని సూచించింది. మెస్సీయా రాజై దేశాలు ఏలుతాడనే భావం ఆనాడు యూదుల్లో ప్రచారంలో వుండేది. ఇకనేం, క్రీస్తు విగ్రహారాధనకు లొంగి తనకు మొక్కుతాడుగదా అనుకొంది భూతం. కాని క్రీస్తుకి దయ్యం పన్నాగం అర్థమయింది. అతడు దైవభక్తుడు. దేవుణ్ణి మాత్రమే సేవించేవాడు. పైగా పిశాచం ఒట్టినే డప్పాలు కొట్టిందేగాని ఈ లోకంలోని రాజ్యాలను ధారదత్తంచేసే అధికారం దానికి లేదు. కనుక క్రీస్తు “నీ దేవుడైన ప్రభువుకి మొక్కి అతన్ని మాత్రమే సేవించాలి" అనే వేదవాక్యాన్ని ఉదాహరించి ఆ దుష్టశక్తిని పారద్రోలాడు - ద్వితీ 6,13. కాని పిశాచం తాత్కాలికంగా మాత్రమే ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అది మళ్ళా క్రీస్తుని శోధించడానికి వస్తుంది - లూకా 4,13.
3. శోధనల స్వభావం
మీద క్రీస్తు శోధనలు పరిశీలించాం. కాని వాటి భావం ఏమిటి?
1. అసలు క్రీస్తు శోధనలు ఎన్ని? ఇక్కడ సువిశేషం మూడు శోధనలు పేర్కొంది. కాని అతని శోధనలు ఇంకా చాలా వున్నాయి. ఎడారిలో నలువదినాళ్ళ మాత్రమే కాదు. అతని బహిరంగ జీవితంలో కూడ శోధనలు వస్తూనే వుండేవి. ఇన్ని శోధనలు వచ్చినా అతని శోధనేమో ఒక్కటే. ఆ వొక్క శోధనే రకరకాల రూపాల్లో మళ్ళామళ్ళా వస్తుండేది. ఏమిటది? అతడు సిలువ మార్గాన్ని విడనాడి పితచిత్తాన్ని మీరాలి అని. క్రీస్తు పిత చిత్తానికి వ్యతిరేకంగా పోయినట్లయితే మనలను రక్షించి వుండలేడు. కనుక పిశాచం అతన్ని తండ్రికి వ్యతిరేకంగా పొమ్మని మాటిమాటికి శోధిస్తుండేది. కాని క్రీస్తుకి పిశాచ హృదయం అర్థమయింది. అతడు తండ్రి యాజ్ఞ మీరేవాడుకాదు. కడన పిశాచం నేరుగా క్రీస్తుని శోధించలేక పేత్రుద్వారా అతన్ని శోధించడం మొదలుపెట్టింది. ఓమారు ప్రభువు తాను యెరూషలేములో సిలువమీద మరణిస్తానని పల్మాడు. పేత్రు "ప్రభూ నీకు సిలువమరణం ప్రాప్తించకుండుగాక" అని అతన్ని వారించబోయాడు. వెంటనే క్రీస్తు "సైతానూ! నీవు నన్ను శోధించకు, ప్రక్కకు తొలగు" అన్నాడు - మత్త 16,21-23. దీని భావం ఏమిటి? సైతాను పేత్రు ముఖాన సిలువ మరణం మానుకొమ్మని క్రీస్తుని శోధిస్తూంది. అందుకే ప్రభువు ఇక్కడ పేత్రుని "సైతాను" అని సంబోధించాడు. ఇలా