పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 280 P.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేదబోధలో ఈ విషయంకూడ ఓ అంశమై వుండాలి. ఈ శోధనలను పఠించేపుడు మనకు క్రీస్తు దైవత్వాన్ని గూర్చి శంక కలుగుతుంది. ఐనా సువిశేషకారులు వీటిని సువార్తల్లో చేర్చారు అంటే ఈ ఘట్టం కల్పితం ఎంతమాత్రమూ కాదని అర్థంచేసికోవాలి.

2. పిశాచం : పిశాచాన్ని ఎదుర్కొనేందుకై పరిశుద్దాత్మ క్రీస్తుని ఎడారికి తోడ్మొనిపోయింది. జ్ఞానస్నాన సమయంనుండి ప్రతి ముఖ్యవిషయంలోను ఆత్మే క్రీస్తుని నడిపిస్తూ వచ్చింది. మెస్సీయా బహిరంగజీవితం జ్ఞాన స్నానంతో ప్రారంభమౌతుంది. కాని మెస్సీయా సాధించవలసిన ప్రధానకార్యం మనలను పిశాచదాస్యంనుండి విడిపించడం. కనుక అతడు తాను నిర్వహించబోయే రక్షణోద్యమం ప్రారంభంలో పిశాచాన్ని ఎదుర్మోగోరాడు. అతడే స్వయంగా వెళ్ళిపిశాచాన్ని కలుసుకొన్నాడు, అదీ మనకోసం, ఈ సందర్భములో జెరోము "క్రీస్తు స్వయంగానే పిశాచంతో పోరాడ్డానికి వెళ్ళాడు" అని నుడివాడు. ఇక, పిశాచానికి యేసే మెస్సీయా కావచ్చునేమో అనే అనుమానం మాత్రం వుంది. కనుక అతన్ని పరీక్షించి చూడాలి అన్న తలంపుతో వచ్చింది దయ్యం.

3. ఎడారి : యిస్రాయేలు సంప్రదాయం ప్రకారం ఎడారి దేవుణ్ణి కలుసుకొనే తావు, శోధనలకు గురయ్యే తావుకూడ.

క్రీస్తుకి ముందు యిప్రాయేలు ప్రజలు నలుబది యేండ్లపాటు ఎడారిలో ప్రయాణం చేసారు. ఈ కాలంలోనే మోషే నలువది రోజులపాటు ప్రార్థనలతో ఉపవాసాలతో సీనాయికొండమీద ఏకాంతంగా గడిపాడు. యేలీయా ప్రవక్తకూడ నలువదిరోజులు ఎడారిగుండ నడిచిపోయి హోరెబు కొండ చేరుకొని అక్కడ దైవసాక్షాత్కారం పొందాడు. వీళ్ళలాగే యేసుకూడ ఎడారిలో భగవత్ సాక్షాత్కారం కలిగించుకోబోతున్నాడు. ఇక, యెడారి శోధనలకు నిలయంకూడ దేవుని మొదటి కుమారుడు యిప్రాయేలు. పిశాచం ఆ యిస్రాయేలీయులను ఎడారిలో శోధించింది. వాళ్ళు లొంగిపోయారుకూడ. క్రీస్తు దేవుని ఏకైక కుమారుడు. మళ్లా ఈ కుమారుడ్డిగూడ దయ్యం ప్రలోభపెట్టింది. కాని ఆ మొదటి కుమారుడు పడిపోయినకాడే ఈ ఏకైక కుమారుడు గెలుపొందాడు. తన పూర్వుల పాపాలకు పరిహారంగూడ చేసాడు. ఇది విశేషం.

4. క్రీస్తుకి శోధనలు దేనికి? పాపం ఏమాత్రం సోకని పావనమూర్తి క్రీస్తు. మరి అతడు శోధనలకు గురికావడం దేనికి? యేసు శోధనలు అనుభవించింది తనకోసం కాదు, పాపులమైన మనకోసం. అతడు నూత్న నరజాతికి శిరస్సు, నాయకుడు. ఈ పాపపు నరజాతి తర్వాత శోధనలకు గురౌతుంది. కనుక తాను ఈ నరుల తరపున ముందుగనే శోధనలు ఆహ్వానించాడు. వాటిమీద విజయం సాధించాడు గూడ. అప్పటినుండి మన నాయకుని విజయం మనదౌతుంది. మనం శోధనలను ఎదుర్కొనేపడు క్రీస్తు విజయం మనమీద సోకి మనకు గెలుపును దయచేస్తుంది.