ఆగస్టీను భక్తుడు ఈ సంగతి చెప్పాడు. క్రీస్తు సమకాలికులు స్థలంలో నడచిపోయి అతన్ని దర్శించారు. ఉదాహరణకు జ్ఞానులు బెల్లెహేము వెళ్లి అక్కడ క్రీస్తుని దర్శించారు. కాని ప్రభువు ఇప్పడు ఏవూరిలోను లేడు. మరి అతన్ని ఎక్కడ చూస్తాం? ఎక్కడికి నడచిపోయి అతన్ని సందర్శిస్తాం? ఇప్పడు స్థలంలో నడచిపోయి క్రీస్తుని దర్శించం. విశ్వాసం ద్వారానే అతని దగ్గరికి నడచిపోయి అతన్ని దర్శిస్తాం. మన ధన్యత ఇక్కడే వుంది. కాని ఈ విశ్వాసం మనకేలా లభిస్తుంది? ఆత్మ ద్వారా, అందుకే ప్రభువు ఆత్మను శిష్యుల మీదికి ఊదింది. క్రీస్తుపట్ల విశ్వాసాన్ని అధికాధికాంగా దయచేయమని మనం ఆయాత్మనే అడుగుకోవాలి.
ఈ నాల్గవ సువిశేషం వ్రాసేప్పటికి క్రీస్తుని ప్రత్యక్షంగా చూచినవాళ్లంతా గతించారు. అతన్నికంటితో చూడని రెండవతరం క్రైస్తవులు మిగిలివున్నారు. వీళ్ళకూడ విశ్వాసంతో క్రీస్తుని దర్శింపవచ్చునని ఈ సువిశేషం హెచ్చరిస్తుంది. నేడు మనంకూడ ఈ వర్గంలో చేరినవాళ్ళమే.
నేడు మనం తోమాను అతని విశ్వాసాన్ని బట్టి గాక అవిశ్వాసాన్ని బట్టి గుర్తుపెట్టుకొంటున్నాం. కాని లోకం మన విశ్వాసాన్ని బట్టి మనలను గుర్తుపెట్టుకొన్ననాడు మనం ధన్యులమౌతాం.
రచయిత ఉద్దేశం 20, 30-31
మొదట యోహాను సువిశేషం ఈ వచనాలతో ముగిసింది. 21వ అధ్యాయం కడపటి సంపాదకుడు చేర్చినది. ప్రభువు చాల అద్భుతాలు చేసాడు. కాని వత్తానం అతని అద్భుతాలన్నిటిలోను గొప్పది.
రచయిత ఈ గ్రంథాన్ని వ్రాయడంలో ఉద్దేశం ఇది. పాఠకులు యేసే మెస్సీయా అని నమ్మాలి. అతడే దేవుని కుమారుడని విశ్వసించాలి. ప్రభువు తండ్రికి విధేయుడై సిలువ మరణాన్ని అనుభవించి మళ్ళా వుత్తానమయ్యాడని అంగీకరించాలి. అతడు దేవుడేనని విశ్వసించాలి. ఈ విశ్వాసం ద్వారానే జీవాన్ని పొందాలి. ఈ జీవం రక్షణమే. ఈ భావాలన్నీ పూర్వం మార్త ప్రకటించిన విశ్వాసంలో వున్నాయి -11,27.
వేదగ్రంథాలు ప్రధానంగా క్రీస్తుపట్ల విశ్వాసాన్ని పెంచుకొని రక్షణాన్ని పొందడానికే వున్నాయి. ఈ లక్ష్యంతోనే నేడు మనం వాటిని పఠించాలి.
5. సరస్సు తీరాన దర్శనం 21, 1-14
యోహాను సువిశేషం మొదట 20 అధ్యాయంతో ముగిసిందనీ, 21వ అధ్యాయం చివరి సంపాదకుడు చేర్చిందనీ చెప్పాం. ఐతే ఈ కడపటి అధ్యాయంలోని భావాలు