ఈ వాక్యం భావం అని చెప్తారు. ఈ భావాన్ని క్యాతలిక్ సమాజం అంగీకరించదు. క్రీస్తు తన అనుచరులకు పాపపరిహార శక్తిని దయచేసాడు. కాని అనుచరులు ఈ శక్తిని ఎట్లా వినియోగించుకోవాలో క్రీస్తు చెప్పలేదు. కనుక నేడు దీన్ని వినియోగించుకొనే విధానంలో పై యిరుశాఖల వారికీ భేదాభిప్రాయాలున్నాయి.
తండ్రి తన్నుపంపినట్లే క్రీస్తు తన అనుచరులను దైవరాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి పంపుతున్నాడు. కనుక వేద బోధకులకు తమపనిలో నమ్మకముండాలి. తాము క్రీస్తు ఉద్యమాన్నే కొనసాగిస్తున్నామనీ, తమతో వుండి ప్రభువే రక్షణ ఉద్యమాన్ని నడిపించుకొనిపోతున్నాడనీ నమ్మాలి. వాళ్లు తమపనిని తాము దీక్షతోను ఉత్సాహంతోను చేయాలి.
ఇంకా బోధకులు ప్రత్యేకంగా ఆత్మశక్తిని పొందినవాళ్లు, వాళ్ల పరిచర్యద్వారా ఆత్మ నరులను క్రీస్తు దగ్గరకి రాబడుతుంది. ప్రజలకు క్రీస్తుపట్ల ప్రీతీ విశ్వాసమూ పుట్టిస్తుంది. నేడు మనద్వారా వేదబోధచేసేది పవిత్రాత్మే మనం ఆ యాత్మను నమ్మి అతన్ని హృదయంలో నిల్పుకోవాలి. అతని చేతుల్లో సాధనమాత్రులంగా తయారుకావాలి.
4. తోమాకు దర్శనం 20, 24-29
పై మూడు సంఘటనల్లోని దర్శనాలు క్రీస్తుకీ అతని సమకాలికులకూ సంబంధించినవి. ఈ నాల్గవ సంఘటనం క్రీస్తుకూ భావికాలంలో రాబోయే విశ్వాసులకూ సంబంధించింది. మనంకూడ ఈ రాబోయే విశ్వాసుల్లో వున్నాం. కనుక తోమాకథ మనకు ప్రత్యేకంగా ఆసక్తిని పుట్టించాలి.
మరియ మగ్డలీన ఉత్థాన క్రీస్తుకి అతిగా అంటిపెట్టుకొని వుంది. క్రీస్తు ఆమెలోని ఆ పొరపాటుని సవరించాడు. ఇక్కడ తోమా ప్రభువు ఇతర శిష్యులకు దయచేసిన దివ్య శ్రుతిని నమ్మక మొండితనంతో వున్నాడు. యేసు అతనిలోని యీలోపాన్ని సవరించాడు.
ఈ భాగంలో 27-28 వచనాలు ముఖ్యమైనవి. 27లో క్రీస్తు తోమాను ఆహ్వానించాడు. 28లో తోమా క్రీస్తుని విశ్వసించాడు. 29లో క్రీస్తు భావివిశ్వాసులందరికీ ధన్యతను ప్రకటించాడు.
తోమా ఇతర శిష్యులు అందించిన సమాచారాన్ని అనగా క్రీస్తు ఉత్తానాన్ని ఎందుకు విశ్వసించలేదు? యూదులు ఉత్థానం ఎప్పుడో లోకాంతంలో జరుగుతుంది అనుకొన్నారు. కనుక క్రీస్తు ఇప్పడు ఉత్తానంకావడమేమిటని తోమా ఆనుమానపడ్డాడు. అలా ఉత్తానమయ్యాడు అని చెప్పబడేవాణ్ణి నేను కన్నులార చూస్తేనేగాని నమ్మను అని