ఉపసంహారం
క్రీస్తు ప్రార్ధనం నుండి మనం ముఖ్యంగా మూడంశాలు గుర్తించాలి. మొదటిది మన జీవితంలో పనీ జపమూ రెండూ కలగలుపుగా కలసి పోతుండాలి. చాలమందికి జీవితంలో పని త్రోవ పనిదే, జపం త్రోవ జపానిదే. దానికీ దీనికీ పొత్తు కుదరదు. దానికీ దీనికీ సంబంధమున్నట్లుగా కనిపించదు. ఇది పెద్ద పొరపాటు. మనం చేసే పనిని సఫలంచేయమని ప్రభుని ప్రార్ధించాలి. ఆ ప్రార్ధనవలన మనంచేసే పనిలో చిత్తశుద్ధి అధికం గావాలి.
రెండవది, క్రీస్తుకు ప్రార్ధనం అనేది ఓ అలవాటు, ఓ జీవిత విధానం. అతడు ప్రార్ధనాన్ని బలవంతంగా తెచ్చిపెట్టుకోలేదు. నిత్యం తన తండ్రి సన్నిధిలో జపిస్తూ వచ్చాడు - అంతే. ఈలాగే మనకూ ప్రార్ధనమనేది ఓ అలవాటు, ఓ జీవితవిధానమూ కావాలి. మనం ఎంత సులభంగా జీవిస్తుంటామో, ఎంత సులభంగా ఆయూ పనులను పూనుకొంటుంటామో, అంత సులభంగానే ప్రార్థనకూడ చేసికొంటుండాలి.
మూడవది, మన ప్రార్ధనం ఆ పరలోకపిత చిత్తాన్ని నెరవేర్చడానికి గాని మన చిత్తాన్ని నెరవేర్చడానికి గాదు. మన కవసరమని తోచిందేమో ఆ ప్రభువుకి తప్పకుండా విన్నవించుకోవలసిందే. కాని మనమడిగిందల్లా అడిగినట్లే ఆ ప్రభువు ఇచ్చితీరాలని మొండిపట్టు పట్టగూడదు. మనకు అవసరమైందీ మేలైందీ ఆ తండ్రి తప్పకుండా ఇస్తాడు. కాని మనకు హితం కానిది మన మడిగినా ఆ ప్రభువు ఈయడు. ఈయకూడదుగూడ. ఈ సత్యాన్ని గుర్తించి మన ప్రార్థనలో దైవచిత్తానికి బదులమై యుండటం నేర్చుకోవాలి. క్రీస్తే ఇందుకు పరమాదర్శం.
2. పరలోకజపం
1. ప్రారంభ విషయాలు
1. సందర్భం
శిష్యులు క్రీస్తును ప్రార్థన నేర్పమని అడిగారు - లూకా 11,1. వాళ్లకు క్రీస్తులాగ ప్రార్థన చేయాలనే కోరిక పుట్టింది. పైగా, క్రీస్తు ఏకాంతంగా ప్రార్థన చేసికోవడం చూసాకనే వాళ్లకు ఈ యభిలాష కలిగింది. అందుకే లూకా సువిశేషం "యేసు ఓ తావులో జపంచేసికొనిన తరువాత ఆయన శిష్యుడొకడు మాకూ ప్రార్థన నేర్పించమని అడిగాడు" అని చెప్తుంది. ప్రభువు ఈలా ఒంటరిగా ప్రార్థన చేసికొంటూవుండేవాడని