పాపం చాల ఘోరమ్తెంది. ఓ వేదశాస్త్రి చెప్పినట్లు అది సాధ్యమైతే భగవంతుణ్ణికూడ నాశం చేయాలని చూస్తుంది. కాని అలా చేయలేదు కనుకనే ఊరకుంటుంది. క్రీస్తుకి అంతటి శారీరక శ్రమనూ అంతటి మానసిక శ్రమనూ తెచ్చి పెట్టింది మన పాపాలే. ఆ ప్రభువు శ్రమలను ధ్యానించుకొని మనం ఇకమీదటనైనా పాపంనుండి వైదొలగాలి. పాపాన్ని అసహ్యించుకోవాలి. పౌలులాగే మనంకూడ "ప్రభువు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణత్యాగం చేసాడు. కనుక ఇకమీదట నేనుగూడ అతనికొరకే జీవిస్తాను" అని నిశ్చయించుకోవాలి - గల 2, 20.
ఐదవ వాక్యం
"నాకు దాహం వేస్తుంది" - యోహా 19,28.
ప్రభువు దాహానికి శారీరకంగా అలసట పొందడం ఒక కారణం. ప్రవచనాలు నెరవేరవలసి వుండడం మరో కారణం. ఈ రెండు విషయాలను పరిశీలించి చూద్దాం.
గాయాల వలన క్రీస్తు శరీరంలోని నెత్తురు చాలవరకు కారిపోయింది. ఆ గాయాలకు ఈదురుగాలి సోకి దేహంలో మిగిలివున్ననెత్తురుకూడ కరుడుకట్టుకొనిపోయేలా చేసింది. ఇంకా సిలువమీద వ్రేలాడే ప్రభువు శరీరం కేవలం కాలుసేతులమీద ఆధారపడి వుండడంవల్ల ఘోరమైన బాధననుభవిస్తూంది. దీని ఫలితంగా కలిగిన జ్వరమూ తలనొప్పి నరములవాపూగూడ ప్రభువుకి తీవ్రమైన దాహం కలిగేలా చేసాయి.
క్రీస్తుకి దాహం కలగడం వింతకాదు. అతడు తనకు దప్పిక కలిగిందని చెప్పడం వింత. ఆకాశంలోని గోళాలను వాటి పరిధిలో నిల్చినవాడు, సముద్రాలను వాటి యెల్లలు దాటి పొంగిపారకూడదని శాసించినవాడు, మోషే బెత్తంతో చరచినప్పడు రాతిచట్టనుండి నీటిపాయను వెలువరించినవాడు, నేనిచ్చే నీటిని త్రాగేవారికి మరల దప్పిక కలుగదని సమరయ మహిళతో చెప్పినవాడు ఇప్పడు నాకు దాహం వేస్తూందని పల్కడం వింతకాదా?
ప్రభువుని సిలువ వేసేప్పడు మొదటిసారి చేదు కలిపిన ద్రాక్షరసాన్ని ఇచ్చారు. కాని క్రీస్తు దాన్ని పుచ్చుకోలేదు - మార్కు 15, 22-23. ఈ పానీయాన్ని సేవిస్తే మైకం కమ్ముతుంది. ఇక బాధలు గుర్తుండవు. తన శ్రమలను విస్మరింపజేసేది కనుక ప్రభువు ఈ పానీయాన్ని సేవింపలేదు. ఈ రెండవసారి అతనికి అర్పించింది పలిసిన ద్రాక్షాసవం, ఇది చౌకరకం పానీయం. ఆ రోజుల్లో దీన్ని రోమను సైనికులకు విరివిగా సరఫరా చేసేవాళ్ళు, ప్రభువుని సిలువవేసే సైనికులు తమకోసం ఓ కుండలో దీన్ని