ప్రతి మనిషీ వెలుగు చూస్తాడు. నేలకు వాలే ప్రతిప్రాణమూ మళ్ళా జీవంతో మొలకెత్తుతుంది. నీవు బోధించే ఈ సత్యం ప్రేరణంవలన నేను ఇకమీదట బాధలకు జంకను, నీయందు నెలకొనినవాడు పడిపోడు. నీతో జీవించి నీతో బాధలు అనుభవించేవాళ్ళు ఆ బాధల్లో గూడ సంతోషాన్ని చవిజూస్తారు. నీతో శ్రమలు అనుభవించే వాళ్ళు నీతో విజయాన్ని పొందుతారు. ఇంతకంటె దొడ్డభాగ్యం ఏముంది?
అంత్య జపం
కార్యసాధకుడవైన ప్రభూ! ఈ బాధామార్గాన్ని ముగించి, యింటికిబోయి దైనందిన కార్యాలను చేపట్టమని నీవు నాకు బోధిస్తున్నావు. మేము మా బాధలను బలవంతంగా అనుభవింపనక్కరలేదనీ, వాటివలన మేము నిరాశచెందకూడదనీ, ఈ కష్టపథం ద్వారా నీవు మమ్ము హెచ్చరిస్తున్నావు. శ్రమలు దుఃఖాన్ని కలిగించి తీరతాయి. ఐనా వాటిద్వారా మాకు రక్షణమూ మహిమా చేకూరుతాయి.
నీయందు నమ్మకముంచి నా బాధలను నేను ఓపికతో అనుభవించాలని నీవు నన్ను మందలిస్తున్నావు. సోదరప్రేమతో తోడి మానవుల మేలు కొరకు నా శ్రమలను అనుభవిస్తే అవి తెచ్చిపెట్టే దుఃఖం తొలగిపోతుందని నీవు హెచ్చరిస్తున్నావు. ఈ సత్యాన్ని నా హృదయ ఫలకంపై స్పష్టంగా లిఖించు. ఇప్పడూ ఎప్పడూ, విశేషంగా ఆపదల్లో జిక్కినపుడు, నీవు అనుగ్రహించే వెలుగు నాకు త్రోవను జూపుతూ నన్నావలకు నడిపించునుగాక, నీవు కోరినట్లే ఇక యింటికిబోయి నా పనులను నేను చేసికొంటూ నీవు నేర్పే యీ గొప్ప సత్యాన్ని నెమరునకు దెచ్చుకుంటాను. ఆమెన్.
2. సప్తవాక్యాలు
ఉపోద్ఘాతం
ప్రభువు సిలువమీద ప్రాణాలు విడుసూ ఏడుమాటలు చెప్పాడు: అవే సప్తవాక్యాలు.
బైబులు చనిపోయేవాళ్ళ మాటలు క్రీస్తువికాక మరి ముగ్గురివి మాత్రమే ఉదాహరించింది. వాళ్ళ మోషే, యాకోబు, సైఫను. నరులు చనిపోతూ చెప్పిన వాక్యాలను వినాలంటే మనకందరికీ కుతూహలంగానే వుంటుంది, మన దగ్గరి బంధువులు చనిపోతూ చెప్పిన మాటలను మనం ఎంత ఆదరంతో గుర్తుంచుకోం! ప్రభువు సిలువపీఠమెక్కి ఏడు