మీదికి దండెత్తి వచ్చాడు, ప్రభువు దూత రాత్రిలో అతని సైన్యాన్ని చంపివేయగా ఆ రాజు భయపడి పారిపోయాడు - 2 రాజు 19-35. ఏలీయా ప్రవక్త నిరుత్సాహ భావాలతో అడవిలో చెట్టక్రింద పండుకొని వుండగా దేవదూత అతన్ని తట్టిలేపి రొట్టెను భుజించమన్నాడు, ఆ భోజనం వలన ప్రవక్త బలం ఉత్సాహం తెచ్చుకొని హొరెబు కొండకు యాత్ర చేసాడు -1 రాజు 19,5-8. ఈలా దేవదూతల సేవలు నానా రకాలుగా వుంటాయి. కీర్తన 34,7 ప్రభువుకి భయపడేవారి చుటూ అతని దూత శిబిరము పన్నుతాడు. సకలాపదలనుండి వారిని కాపాడతాడు అని చెప్పంది. ఇంకా కీర్తన 91, 11-12
ప్రభువు నిన్ను తన దూతల అధీనంలో వుంచుతాడు
నీవు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ నిన్ను కాపాడుతూంటారు
నీ కాళ్ళు రాతికి తగిలి నొవ్వకుండేలా
వాళ్ళు నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకొంటారు
అని వాకొంటుంది. తోబీతు గ్రంథమంతా దేవదూత నరులను కాచికాపాడ్డాన్ని గూర్చే రఫాయేలు తోబియాను చేప బారినుండి, అస్మోదియసు అనే పిశాచం బారినుండి కాపాడాడు. గబాయేలు నుండి అతని సొమ్ముతెచ్చియిచ్చాడు. సారాను అతనికి వివాహం చేయించాడు. ముసలి తోబీతుకు చూపు వచ్చేలా చేసాడు. ఈలా నరులకు సాయపడి ఉపకారాలు చేయడమే దూతల పని.
నూత్న వేదం సన్మనస్కుల సేవలను ఇంకా విస్తృతంగా పేర్కొంటుంది. హెబ్రేయుల జాబు "దూతలు దేవుణ్ణి సేవిస్తూ రక్షణను పొందబోయేవారికి సహాయం చేయడానికి దేవునిచే పంపబడిన ఆత్మలు" అని చెప్పంది –1,14 అనగా దేవుణ్ణి సేవించడం, నరులకు సహాయం చేయడం దూతల ముఖ్య కార్యాలని భావం. నూత్న వేదంలో వాళ్ళు ప్రధానంగా క్రీస్తుకి పరిచర్యలు చేస్తూంటారు. అతని రాజ్యాన్ని వ్యాప్తిచేస్తూంటారు. ఒక దూత జకరియాకూ మరియకూ రాబోయే మెస్సీయాను గూర్చి తెలియజేసాడు. హెరోదు బాలయేసుని నాశం చేయబోతూంటే ఒకతని యోసేపని హెచ్చరించాడు- మత్త2, 13. మరో అతని క్రీస్తు జననాన్ని కాపరులకు ఎరిగించాడు - లూకా 2, 9–11. ఎడారిలో తపస్సుచేసి అలసిపోయిన క్రీస్తుకి కొందరు దూతలు పరిచర్యలు చేసారు. ఆలాగే ఒలీవల తోపులో ప్రభువు శ్రమలనుభవించినపుడు కూడ - లూకా 22,43. పుణ్యస్త్రీలు సమాధి దగ్గరికి వచ్చినపుడు దాని మీద బండను తొలగించినది దేవదూతే - మత్త28,2. వారికి ప్రభువు ఉత్థానవార్త తెలిపింది కూడ అతడే - 28, 5-6. ప్రభువు మోక్షారోహణం చేసేపుడు గూడ దూతలు ప్రత్యక్షమౌతారు - అ,చ. 1,10.