బలికాలేదు. తండ్రి ప్రేమతో ఆ కుమారుణ్ణి అర్పించాడు. ఆ కుమారుడు మన కొరకు, మన ప్రతినిధిగా బలి అయ్యాడు. ఔను, ఈసాకు బలిని అర్థం చేసికున్నవాళ్ళకు క్రీస్తుబలి చక్కగా అర్థమౌతుంది.
56. పూర్వవేదవ్యక్తులూ, బలులూ
బాధామయ సేవకుడూ, ఈసాకూ క్రీస్తుకు సూచక వ్యక్తులన్నాం. ఈ సూచకవ్యక్తులు ఇంకా చాల మంది వున్నారు. నీతిమంతుడైన హెబేలు నందు క్రీస్తు వధింప బడ్డాడు. యోసేఫునందు అన్నదమ్ములు అతన్నిద్వేషించారు. గోతిలో కూలద్రోసి చంపడానికి సిద్ధమయ్యారు. చివరకు అన్యులకు అమ్మివేసారు. యిర్మీయా యందు అతన్ని ముప్పతిప్పలు పెట్టారు. ముగ్గురు బాలకులందు అతన్ని నిప్పల కొలిమిలోనికి త్రోసారు. దానియేలు నందు సింహముల గుంటలో పడద్రోసారు. యూదులు ప్రతిబలిలోను అతన్నే సమర్పించారు. ఓడ నుండి వెలుపలకు రాగానే నోవా సమర్పించిన సమాధానబలిలో, పితరులు కొండమీద సమర్పించిన బలుల్లో, మోషే గుడారంలో సమర్పించిన బలుల్లో, అతని అనుయాయులు దేవాలయంలో సమర్పించిన బలుల్లో క్రీస్తు నెలకొని వున్నాడు. ఈ రీతిగా అనాది నుండి ఆయా వ్యక్తుల్లో ఆయాబలుల్లో సాంకేతికంగా సమర్పింపబడి కాలం పరిపూర్ణంకాగా మానసికంగా చారిత్రికంగా సమర్పింపబడ్డాడు క్రీస్తు. అతని సమర్పణం ద్వారామనకు రక్షణం సిద్ధించింది. బలిమూర్తియైన క్రీస్తును మననంచేసికొని ధ్యానిద్దాం.
57. క్రీస్తు విధేయత
క్రీస్తును సూచించిన పూర్వవేద వ్యక్తులను తిలకించాం. ఇక, క్రీస్తు మనోభావాలను పరిశీలిద్దాం. అతడు కేవలం సిలువమీద చనిపోవడం ద్వారానే మనలను రక్షించలేదు. ఈసాకులాగా ప్రేమతో విధేయతతో చనిపోయి మనలను రక్షించాడు. కనుక క్రీస్తు మానసికభావాలు గూడా చాలా ముఖ్యం.
మొదట క్రీస్తు విధేయతను పరిశీలిద్దాం. ఆదాము అతివిధేయత లోకాన్ని పాపంలో ముంచివేసింది. కాని క్రీస్తు విధేయత ఈ పాపాత్ములను మళ్ళా నీతిమంతులను చేసింది. అనగా వీళ్ళకు రక్షణం ఆర్ధించిపెట్టింది. ఆదాము మంచి సెబ్బరలు తెలియజేసే పండు తిని దేవునితో సమానం కావాలనుకున్నాడు. అది అతని మిడిసిపాటు. కాని క్రీస్త విధేయుడై మరణానికి - నీచాతి నీచమైన సిలువ మరణానికి లోబడ్డాడు. అది అతని అణకువ - ఫిలి 2,8. ఈ యణకువ లేందే క్రీస్తు సిలువబలి తండ్రికి ప్రియ పడేదిగాదు. ప్రభు విధేయత మనలను పునీతులను జేయాలని ప్రార్థిద్దాం.