6. పాపమూ, శిక్షా
1. చెట్లనడుమ దాగుకొన్నారు
సాయంకాలం దేవుడు తోటలో నడయాడ్డానికి రావడం చూచి భయపడి ఆదామేవలు చెట్లనడుమ దాగుకొన్నారు — 3,8. నరులిద్దరూ దేవుని యెదుటబడకుండ దాగుకొన్నారు. వాళ్లింతవరకూ దేవుని బిడ్డల్లాగ, దేవుని స్నేహితుల్లాగ మెలిగారు. కాని యిప్పడు ఆ తండ్రి యెదుటికి రాలేకపోయారు. కారణం? పాపంవలన దేవుని స్నేహాన్నీ అనుగ్రహాన్నీ కోల్పోయారు.
2. ఆవిడ తినమంటే తిన్నాను.
దేవుడు నీవు పండునెందుకు తిన్నావని ఆదామని అడుగగా అతడు, నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమంటే తిన్నాను అన్నాడు. దేవుడు స్త్రీని నీవెందుకు తిన్నావని అడుగగా ఆమె, పాము తినమంటే తిన్నాను అంది. పాపపు మానవుడు తన తప్పతాను ఒప్పకోడు. ఇతరులమీద నింద మోపుతూంటాడు. మన మందరమూ ప్రతిదిన జీవితంలో ఈలాగే చేస్తుంటాం.
3. ముగ్గురికీ శిక్షలు
దేవుడు పిశాచాన్నీ ఏవనూ, ఆదామునీ శిక్షించాడు. ఈ మువ్వరూ ఒకరి కొకరు బాధాకారణ మౌతారు. పిశాచాన్ని స్త్రీ బాధిస్తుంది. స్త్రీని పురుషుడు బాధిస్తాడు.
కాని దేవుడు ఆమవ్వరిలోను పాము రూపంలోవున్న పిశాచాన్ని మాత్రమే శపించాడు. దానికి నిత్యమూ మట్టే ఆహారం. ఇక్కడ మట్టిని తినడమంటే శిక్షను పొందడమని భావం. అంటే పిశాచం సదాశిక్షననుభవిస్తూ వుండిపోతుందని అర్థం.
స్త్రీకి మూడు శిక్షలు పడ్డాయి. 1 ఆమె ప్రసవ వేదన ననుభవించి బిడ్డలను కంటుంది. 2. భర్తమీద ఆమెకు విపరీతమైన వ్యామోహం కలుగుతుంది. 3. అతడు ఆమెమీద పెత్తనం చేస్తుంటాడు. కనుక ఆమె ఓ బానిసలా బ్రతుకుతుంది. అనగా తల్లిగా, భార్యగా ప్రస్తుతం స్త్రీ జీవించే జీవితం కష్టమైందని భావం. ఈ కష్టానికి ఆమె తొలిపాపమే కారణం అంటాడు రచయిత.
ఇక ఆదాముకి రెండు శిక్షలు పడ్డాయి. 1. అతడు బ్రతికినన్నాళ్లు కష్టపడి, నొసటి చెమటోడ్చి కూడు సంపాదించుకోవాలి. నేల చాలినంతగా పంటలు పండదు. 2. అతడు మట్టినుండి పుట్టాడు. చివరకు అమట్టిలోనే కలసిపోతాడు. దేవుడు నెనరుతో