4. ఆలికి హత్తుకొని పోవడం
భార్యాభర్తలిరువురూ కలసి ఒక్క వ్యక్తిగా ఐక్యమైపోతారు. నరుడు తల్లిదండ్రులతో కంటేగూడ భార్యాతో అధికంగా ఐక్యమైపోతాడు. కనుకనే అవసరం వచ్చినపుడు జననీ జనకులను కూడ వదలి ఆలికి అతుకుకొంటాడు. వాళ్లిద్దరూ ఇద్దరై గూడ ఏకవ్యక్తుల్లా జీవిస్తారు. అందుచేత ఇకవాళ్లకు విడాకుల్లేవు. - మార్కు 10,9. ఒకరు చనిపోతేనే గాని ఇంకొకరు మల్లా వివాహబంధంలో ప్రవేశించడానికి వీల్లేదు.
స్త్రీ పురుషునికి ముందు నడవదు, వెనుకా నడవదు. అతని ప్రక్కన నడుస్తుంది. అతనికి సరిసమానంగా జీవిస్తుంది. అతడున్నకాడల్లా ఆమెకూడ వుంటుంది. అందుకే తొలి ఆదాము ఒక స్త్రీతో ఐక్యమయ్యాడు. ఆలాగే మలి ఆదాము క్రీస్తు కూడ మరో స్త్రీ తో ఐక్యమయ్యాడు. ఆ స్త్రీ భార్య, ఈ స్త్రీ తల్లి, అంతే భేదం.
తొలి ఆదాము నిద్రిస్తూండగా అతని ప్రక్కలో నుండి స్త్రీ బయల్వెడలింది. ఆలాగే మలి ఆదాము నిద్రిస్తూండగా అతని ప్రక్కలోనుండి మరొక స్త్రీ బయల్వెడలింది. ఈరెండవ స్త్రీయే శ్రీసభ, క్రైస్తవ సమాజం. అనగా మృతక్రీస్తు దేహంనుండి బయల్వెడలిన నెత్తురూ నీళూ విశ్వాసులను కడిగి శుద్ధిచేస్తాయి. వాళ్లే క్రైస్తవ సమాజం. అందుకే ప్రాచీన క్రైస్తవ రచయితలైన పితృపాదులు ఏవ పుట్టుక శ్రీసభ పుట్టుకకు పోలికగా వుంటుందని చెప్పారు. చూడు ఎఫె - 5, 31-32. ఆదాము దైవపత్రుడై రాబోయే క్రీస్తుని సూచిస్తుంటాడు. ఏవ రాబోయే శ్రీసభను సూచిస్తుంది. సృష్టి మనుష్యావతారాన్ని సూచిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, రాబోయే క్రైస్తవ సత్యాలన్నీ ఆది దంపతుల చరిత్రలో బీజరూపంగా ఇమిడేవున్నాయి.
ఆదాము ఏవ దిసమొలతో ఉన్నాగానీ వారికి సిగ్గువేయలేదు - 2,25, అనగా ఆదిదంపతుల్లో ఇంకా కామవికారం పుట్టలేదని భావం. వారిలో ఇంకా ఆశాపాశాలూ వ్వామోహాలూ లేవు. శాంతిసమాధానాలు నెలకొని వుండేవి. దేహం బుద్దిశక్తికి లొంగివుంది.
4. ఏదెను తోట
1. ఏదెను తోట
ప్రభువు ఏదెనులో తూర్పువైపున ఒక తోటను నాటి ఆదామని ఆతోటలో వుంచాడు - 2,8. దేవుడు మంచివాడు, కరుణ గలవాడు. అతడు పిడికెడు మట్టినుండి నరుడ్డి చేయడం మాత్రమే గాదు, ఆనరునికి చక్కని వాతావరణంకూడ కలిగించాడు. ఆవాతావరణమే ఈతోట. పాలస్తీనా దేశం ఉష్ణదేశం. కనుక యూదప్రజలకు చెట్టుచేమలన్నా