ధ్యానం చేసికోవాలి. దివ్యభోజనం లాగే దివ్యవార్తగూడ మనకు జీర్ణంగావాలి. దివ్యభోజనంలో పాల్గొని దివ్యవార్తలో పాల్గొననివాడు సగం క్రైస్తవుడు మాత్రమే.
7. క్రీస్తు రూపం :
బైబులు చదవడం ద్వారా క్రీస్తు రూపాన్ని హృదయంలో చిత్రించుకుంటాం. క్రీస్తు భావాలను పెంపొందించుకుంటాం. క్రీస్తును అనుకరిస్తాం. క్రీస్తులోనికి మారిపోతాం. ఉదాహరణకు, పరస్త్రీలనుగూర్చి మన హృదయంలో చెడు కోరికలు కలుగుతాయి. పరస్త్రీని మోహదృష్టితో చూచినా మానసిక వ్యభిచారం చేసినట్లే అన్న ప్రభువాక్యం పర్వత ప్రసంగంలో చదువుతాం. ఈ వాక్యాన్ని మననం జేసికొని మన హృదయంలోని చెడు కోరికలను అణచుకుంటాం, లేదా, ఎదుటివాళ్ళమీద పగగా వుంటాం. మిత్రులనేగాదు శత్రువలనుగూడ ప్రేమించండి అన్న ప్రభువాక్యం పర్వత ప్రసంగంలో గుర్తిస్తాం. గుర్తించి మనలోని ద్వేషాన్ని అణచుకుంటాం. ప్రభుసందర్శనం వలన జక్కయపాపజీవితం మార్చుకున్నాడు (లూకా 19:8). అదేవిధంగా మనంగూడాను. బైబులు పఠనంద్వారా భక్తుడు రోజురోజుకు క్రీస్తులోనికి మారిపోవాలి. క్రీస్తురూపం పొందుతూండాలి.
పౌలు తాను క్రీస్తును బోధించకముందు ఆరు మాసాలకాలం అరేబియా ఎడారిలో క్రీస్తును ధ్యానించుకున్నాడు. మొదట ప్రభుసాక్షాత్కారం కలిగించుకొని ఆ పిమ్మటగాని తాను హృదయంలో చిత్రించుకున్న క్రీస్తును ఇతరులకు బోధించలేదు (గల. 1:17)
8. క్రియాత్మక శక్తి :
దైవవాక్కు శక్తిమంతమైంది. అందుకే యీ వాక్కును వర్షంతో పోల్చాడు యెషయా ప్రవక్త (55:10). ఆకాశంనుండి వచ్చినవాన వ్యర్థంగా బోదు. నేలను పదునుజేసి, పైరు పండించి, సేద్యగానికి అన్నం అందిస్తుంది. అలాగే ప్రభువుచెంతనుండి వెలువడిన వాక్యంగూడ వ్యర్థంగా బోదు. మన హృదయాలను సోకి మెత్తపరుస్తుంది. ప్రభువు సంకల్పించుకున్న కార్యాలను మనచే చేయించితీరుతుంది. దైవవాక్కులో ఈ క్రియా సాధన శక్తివుంది. అందుకే ప్రభువు ఆజ్ఞాపింపగానే సృష్టి జరిగింది. వెలుగు కలగాలి అనగానే కలిగింది. నెమ్మది కలగాలి అనగానే అలలు సమసిపోయి సరస్సు ప్రశాంతమైంది. కుష్ట పోవాలి అనగానే కుష్టరోగి స్వస్టుడయ్యాడు. క్రియత్మకమైన ఈ దైవవాక్కే నేడూ మనకు బైబుల్లో లభిస్తుంది. బైబులు వ్రాసినవాడు భగవంతుడు అన్నాం. అంచేత బైబులు చదివేప్పడు భగవంతుని ప్రత్యక్షశక్తి మనమీద పనిచేస్తుంది. "సువార్త క్రీస్తు కంఠం" అన్న అగస్టిన్ భావం యిదే. అన్యగ్రంథాల్లో వేటిల్లో గూడ యిూ శక్తి వుండదు.