చేసికొనవచ్చు. అప్పడు “క్రీస్తు తన ఆత్మను వదలాడు" అనే వాక్యం సిద్ధిస్తుంది. అనగా అతడు పరిశుద్దాత్మను మనమీదికి వదలాడు అనే భావం వస్తుంది. ఈ రీతిగా ప్రభువు మనకు ఆత్మనిచ్చేవాడు. పైన మోషే రాతిబండనుండి వెలువరించిన నీళ్లు ఈ ఆత్మనే సూచిస్తాయి అని చెప్పాం.
3.కంచు సర్పం
ప్రజలు హోరు పర్వతంనుండి కదలి ఎదోము దేశం వైపుగా ప్రయాణం చేస్తున్నారు. కాని ఆ ప్రయాణంలో వాళ్లు సహనం కోల్పోయి మోషేమీద తిరగబడ్డారు. "నీవు ఈ యెడారిలో మా ప్రాణాలు తీయవుకదా! ఈ పాడుకూడు మన్నా మాకు రుచించడంలేదు" అని గొణిగారు. అందుకు ప్రభువు వాళ్ళమీద కోపించి విషసర్పాలను పంపగా అవి చాలామందిని కాటేసాయి. అప్పడు ప్రజలు భయపడిపోయి మోషేకు మొరపెట్టుకొన్నారు. అతడు యావే ఆజ్ఞపై కంచు సర్పాన్నిచేసి ఎత్తైన గడెమీద తగిలించాడు. పాము కరచిన వాళ్ళు ఆ సర్పంవైపు చూడగా విషం విరిగిపోయింది - సంఖ్యా 21,4- 9. ఈ ఘట్టాన్ని స్మరించుకొంటూ తర్వాత జ్ఞానగ్రంథగారుడు "ప్రభో! ఆ ప్రజలు కంచుసర్పంవల్ల ఆరోగ్యం పొందలేదు. నరుల రక్షకుడవైన నీవల్ల స్వస్థత పొందారు" అని వ్రాసాడు -16, 7. అనగా యావే ఆ కంచుపాముద్వారా ప్రజలకు ఆరోగ్యం దయచేసాడు. ఈ ఘట్టంమీద వ్యాఖ్య చెపుతూ రబ్బయులు “యిస్రాయేలీయులు పాముకాటునుండి ఏలా బ్రతికారు? వాళ్లు దేవునివైపు మనసు మరల్చారు. మోక్షంలోని తండ్రిమీద హృదయంనిల్పి స్వస్దులయ్యారు" అని నుడివారు.
ఇక, నూత్న వేదంలో మన కంచుసర్పం క్రీస్తే. మోషే సర్పాన్ని గడెమీదికి ఎత్తినట్లే క్రీస్తునిగూడ సిలువమీదికి ఎత్తారు. పూర్వవేద ప్రజలు ఆ గడెమీది సర్పాన్నిచూచి బ్రతికిపోయారు. నూత్నవేద ప్రజలు సిలువమీది క్రీస్తునిచూచి - అనగా అతన్ని విశ్వసించి - బ్రతికిపోతారు - యోహా 8,14-15.
4 చేతులు చాచిన మోషే
రెఫిదీమదగ్గర మకాము చేస్తూన్నపుడు అమాలెకీయులు యిస్రాయేలీయులను ఎదిరించారు. యోషువా వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. మోషే, అహరోను హూరులను తీసికొని దైవసహాయం ఆర్థించడానికై కొండమీదికి వెళ్ళాడు. అక్కడ అతడు చేతులు చాచి ప్రార్థించాడు. అతడు చేతులు చాచినపుడు యిస్రాయేలీయులు గెలిచారు. కాని చేతులు దించినపుడు అమాలెకీయులు గెలిచారు. తానెంతసేపని అలా చేతులు చాచి వుంచగలడు? అందుచే మోషే ఓ రాతిమీద కూర్చోగా అహరోను హూరు చెరోవైపు