పుట:Bharatiyanagarik018597mbp.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సింగసరి రాజ్యము

క్రీ. శ. 1220 లో పైవిధమున అరోక్ వలన సింగసరి రాజ్యము ప్రాముఖ్యతనందెను. ఈతని కాలమున జావాశిల్పములలోనెల్ల ప్రఖ్యాతి వహించిన ప్రజ్ఞాపరిమితా విగ్రహము నిర్మింపబడినది. రాణియగు డీడిస్ సౌందర్యమున కిది ప్రతి కృతియట. అరోక్ క్రీ. శ. 1227 లో హత్య చేయబడెను. అతనికి నాల్గవతరమువాడగు కృతసగరుని రాజ్యకాలము (1268-92) మిగుల ముఖ్యమైనది. ప్రజలీ తనిని శివబుద్దుల యపరావతారమని కొనియాడిరి. కాని వాస్తవముగ నాతని రాజనీతి ప్రమాదకరముగ నుండెను. స్వరాజ్యమున తన యధికారమును బలపఱచుకొనకుండగనే యీతడు, బాలి, వకుళపురాది రాజ్యములకు యుద్దయాత్రలను సాగించి, కడువ్యయప్రయాసలకు లోనయ్యెను. మహాగర్వముచే నాతడు చైనా చక్రవర్తిపంపిన రాయబారి నవమానించెను. ఈ యదనున కెదిరి రాజుల సంతతివాడును సామంతుడునగు జయకటంగ్ అను నతడు విద్రోహమొనర్చి, కృతసగరుని యల్లుడగు విజయుని నిర్జించి, రాజధానియగు సింగసరిని బ్రవేశించి, రాజునుజంపి, సింహాసనము నధిష్ఠించెను. విజయుడు జావాకుత్తరమునగల మధురాద్వీపమునకు పాఱిపోయి, కొంతకాలమునకు బిమ్మట సింగసరికి వచ్చి జయకటంగ్‌వద్ద కొలువుండెను. అప్పటినుండియు విజయుడు పగదీర్చుకొన నవకాశమునకై వేచియుండెను. క్రీ. శ. 1293 లో కృతసగరుని గర్వము నణంచుటకై చైనా చక్రవర్తి జావాద్వీపముపై గొంత బలమును బంపెను. విజయు డీవిదేశీయులయెడ గపటస్నేహమును జూపి, వారలను జయకటంగ్‌పై కనిపెను. యుద్దమున కటంగ్ మరణించెను. పిమ్మట విజయుడు చైనాసేనల నెదుర్కొని చెల్లాచెదరు గావించెను. ఇంతటితో సింగసరి రాజ్యమంత మందెను.