పుట:Bharatiyanagarik018597mbp.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యు నామములుండెడివి. ఈ దేశములో కృష్ణాగోదావరీ తీరస్థులు పెగూలోనికి వలసవచ్చిరని యొకగాథగలదు. బర్మాలోని 'త్రైలింగులు, త్రిలింగ దేశవాసుల సంతతివారైయుందురు. ప్రాచీన త్రైలింగభాషలో సంస్కృత పదములును, ఆంధ్రదేశ ప్రశంసయు గాంచనగుచున్నది. ఈత్రైలింగ్ లిపి క్రీ. శ. 4 వ శతాబ్దపు వేంగిలిపిని బోలియున్నది. ప్రోం జిల్లాలో క్రీ. శ. 1 వ శతాబ్దిలో నాంధ్రదేశమున లిఖింపబడిన శాసనముల లిపినిబోలు లిపిలో వ్రాయబడిన శాసనమొకటి గన్గొనబడినది. ఇచ్చటనే యొక బౌద్దస్థూపమునం దాంధ్రదేశపు తెలుగు కన్నడ లిపిలో వ్రాయబడిన మఱియొక శాసనమున్నది. బర్మాలోని పెగన్ (Pegan) లో బూర్వము రాజ్యమేలిన 'శాన్ లన్ క్రోం, (San Lan Krom) అను రాజు బర్మాలో బౌద్ధమతమును వ్యాపింపజేసెనని శాసనాలంకార మనుగ్రంథమునుండి తెలియుచున్నది. ఈ రాజు క్రీ. శ. 3-5 శతాబ్దములలో వేంగీదేశము నేలిన శాలంకాయనుల సంతతివాడనియు, నీవేంగీరాజులు బర్మాలో నొక రాజ్యమును నెలకొల్పి దమవంశీయు నొకనిని దత్పాలకునిగ నియమించిరనియు, బండితుల యభిప్రాయము.

(3) మలేద్వీపకల్పము :- ఇచటి తూర్పుతీరమునందలి 'లిగోర్‌' నగర మశోకుని వంశీయునిచే నిర్మింపబడెననియొక గాథగలదు. పల్లవవంశమునందొక యశోకుడు పేర్కొనబడియున్నాడు. అతడే యీ స్థాపకుడై యుండునేమో. సాల్మొనీయను పండితుడు లిగోర్‌నగరమునందలి హిందూశిల్పము ఎల్లోరా మహాబలిపుర శిల్పములను పోలునని వ్రాసియున్నాడు. స్వర్గలోక (Sanvan Kolak) మను మఱియొక స్థలమున దొరికిన కంచు ప్రతిమలకు, ఆంధ్రదేశమునందలి గుంటూరు జిల్లాలోని 'బుద్దాణీ, విగ్రహమువలె కోలముఖములును, స్ఫుటములగు కేశములును, చంద్రవంకలబోలు కన్బొమలును, కొక్కెమలవంటి ముక్కులును, నగు మోములును గలవు.