పుట:Bharatiyanagarik018597mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయ నాగరికతా విస్తరణము.

8. దక్షిణహిందూదేశము - ప్రాగ్భారతదేశములు.

ఈవిధమున దేశాంతరములందు భారతీయనాగరికతను విస్తరించు నెడ హిందూదేశమునందలి యుత్తరాపధ దక్షిణాపధములు రెండును సమముగ బాల్గొనినవి. ముఖ్యముగ బౌద్దమతమును, సంస్కృతప్రాకృత వాఙ్మయములను విదేశీయు లుత్తరదేశమునుండి గ్రహించిరి. అందు కాశ్మీరమును, వంగదేశము నగ్రగణ్యములు. మనదేశమునకు బ్రాగ్దిశ నున్న ద్వీపములకును బ్రకృత ఇండోచైనాకును దక్షిణహిందూదేశముతో సన్నిహితమగు సంబంధముండినటుల స్పష్టమగుచున్నది. యీసంబంధ మీదేశములందలి గాథలు, శాసనములు, దేవతలు, మతము, కట్టడములు మున్నగువానిలో గాంచనగుచున్నది.

(1) వర్తకము :- మొదటినుండియు దక్షిణదేశవాసులు సముద్రయానమునకును, విదేశవాణిజ్యమునకును వాసికెక్కి యుండిరి. మలబారుతీర మీసందర్భమున బేర్కొనదగినది. అటనుండి పాశ్చాత్యదేశములతో వర్తకము జరుగుచుండెడిది. అటులే దూర్పుతీరమున పాండ్యరాజ్యములోని కోర్కె (Kor ai) నగరమును, చోళుల రాజధానియగు కావేరీ పట్టణమును, మహాబలిపురమును, ఆంధ్రదేశమునందలి గూడూరు, ఘంటశాల, మోటుపల్లి, కోరంగి మున్నగు రేవుస్థలములును బ్రాగ్దేశములతో వాణిజ్యమును నెరపుచుండెడివి.