పుట:Bhaarata arthashaastramu (1958).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములు. ఇక వస్తువుల నుపయోగించుటకే గాని యట్లేదాచి గుడిలో దేవరంబోలె పూజించుటకై సంపాదించు వాడెవడునులేడు. విత్తములు వాంఛాపూర్తికొఱకు, అనగా వినియోగమునకు. విత్తములు లేనిది వినియోగము మృగ్యము. వినియోగములేనిది విత్తములును బడయబడవు. కనుక నివియు బరస్పరావలంబములే.

కర్మలు సాఫల్యమునొందుట కనేకుల సాహాయ్య మావశ్యకము. కర్తయైనవానికి గూలివాండ్రు మొదలగువారు కూడినంగాని ప్రయోజనము సిద్ధింపదు. వచ్చిన లాభము వీరిలో బంచుకొన వలయును. దీనికే 'విభజన' మనిపేరు. ఇది వినిమయములో జేరినది గాని వేరుగాదు. వినిమయమనగా అమ్మకము. పనిచేయువారును చేయించువారును దమతమ శక్తులను వేతనములకు మార్చుకొను చున్నారని భావించినచో విభజనము వినిమయము క్రిందికి వచ్చును. అయిన నిది మిక్కిలి ముఖ్యముగాన ప్రత్యేకభాగముగా బరిగణింపబడుచున్నది.

అర్థశాస్త్రములో ముఖ్యభాగము లేవనగా :- ఉత్పత్తి, విభజనము, వినిమయము, వినియోగము. ఇవిగాక రాజులు పన్నులు విధించు క్రమము, తద్ర్వయము ఇత్యాది విషయములం జర్చించు భాగంబొండుగలదు. దీనినే 'రాష్ట్రీయార్థశాస్త్రం' బని కొందఱందురు. ప్రాచీన నీతిశాస్త్రంబులందెల్ల నిదియే ముఖ్యాంశము.

పై విషయములన్నియు అర్థశాస్త్రమున బ్రధానవిషయములును దుర్బోధములును గాన నింతవిపులముగ జర్చింపవలసి వచ్చినది. ఈ భాగము బాగుగ నభ్యసించినంగాని ఈ శాస్త్రమున బ్రవేశము కలుగుట దుర్లభము.