మొత్తముమీద నుత్పత్తి, మూలధనము, నాణెములు ఇవి మితిజెందక యధికముగ పెఱిగినను విఱిగినను నార్థికమండల మల్లల నాడిపోవుట నిజము. కావున సమత్వసిద్ధి పడయదగిన పరమార్థము.
కొన్ని క్షోభల చరిత్రము
ఇంగ్లాండులో బూర్వము సుమారు పదియేండ్లకొకపర్యాయం క్షోభలు గలుగుచుండెను. వీనిలో గణ నీయములైనవి 1825, 1837, 1847, 1857, 1866 ఈ సంవత్సరములం బుట్టినవి. పదియేండ్ల కొకతూరి యశుభములు గలుగవలయునని యెవడైన ఋషి శాపంబిడి యుండునని భ్రమింపబోకుడు! ఇపుడు 40 ఏడులుగా నెక్కువ జాగ్రత్తతో వ్యాపారములు నడుచుచుండుటంబట్టియు, క్షోభలయొక్క హేతువులు విశదము లైనందునను నయ్యవి యుపసంహరింపబడి యున్నవి. ఇట్లనుటచే నిక నెన్నడు నవి రావనుటగాదు. సకృత్తుగ జరుగుననుట.
1825 వ సంవత్సరపు మహాక్షోభ
ఇంగ్లాండులో ధనము లమితములైనందునను, దాచి ప్రోగుచేయువాడుకలేక ప్రయోగోత్సాహము గలవారగుటను విశేషించి వ్యాపారములకుంబూనిరి. ధనము నిధులలో నమితరాసులుగా నిక్షేపింప బడియుండుటచేత బ్యాంకీలవారు తఱుచు విచారణచేయకయే నూతనోద్యమములం జేయనెంచి యాసించినవారికి ఋణము లఖండముగ నీయసాగినందున గొన్నివస్తువులకు గిరాకిలేకున్నను వచ్చునను నుత్సాహముతో ననేకవిధములైన క్రొత్తమార్గముల ధనము నుపయోగింప వ్యవహారులు ప్రారంభించిరి. ప్రత్యక్షమైన గిరాకికిగాక యనాగతమైనదానిని నమ్మిచేయుటలో లాభమునకు దుల్యమైన యుపాయమున్నదనుట యిదివఱకే మీరెఱిగిన విషయము. ఇట్లు పడసిన ధనంబును గనుల యందును, విదేశవర్తకులకు నప్పులిచ్చుట యందును వినియోగించిరి, 1824 వ సంవత్సర ప్రారంభంబున నపరి