Jump to content

పుట:Bhaarata arthashaastramu (1958).pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుద్ధసన్నద్ధము లగునని సూచనయుండెబో, అప్పుడే యా మర్మముల నెట్లైన గనిపెట్టి "యుద్ధము ప్రారంభించిన నెగుమతులెట్లుమాఱును దిగుమతు లెట్లుమాఱును" అని యోచించి "యీవస్తువుల సేకరింపుడు, వీని నిలువబెట్టుడు" అని యాదేశించుటలో మార్గన్ అనన్యతుల్యుడని ప్రసిద్ధి. రష్యా వారికిని జపాన్‌వారికిని ఘోరమైన రణమైనప్పుడు "సైన్యములెన్ని ముందునకుం బోవును, వాని భుక్తికి నేయేవస్తువు లేయేమాత్రము పట్టును. యుద్ధోపకరణముల కెంత గిరాకియుండును" అని ముందే యోచించి జాగ్రత్తజేసినవారు, ఒక్కదాటున లక్షాధికారులైరి.

సంభూయ సముత్ధానములు

గొప్ప గొప్ప వ్యాపారము లొక్కనిచే నిర్వాహ్యములుగావు. పలువురుగలిసి భాగము లేర్పఱచికొని యుద్ధరించినంగాని కార్యంబు తుదముట్టదు. అత్యంత చతురుడొక్కడు, అపాయములేని యుపాయ మని యొక వ్యవహారముం దలపోసి దాని స్థితిగతుల వివరించి కొందఱకు నమ్మికగలుగజేసి చేర్చుకొని యొకకంపెనీగగుదిర్చి, భాగములుగొనువారున్న నీతేదిలోపున దరఖాస్తులు పంపవలసినదని ప్రకటనలం బంపును. ఇట్లు పంపుటకుం బూర్వమే బ్యాంకీదారుల సమ్మతియు బడసియుండును. అనేకులా సంఘములో భాగస్థులుగా జేరుదురు. పిమ్మట నందఱును పెద్దతనమునకుంబూనిన నేపనియుజెడును గాన డైరెక్టర్లు, అనబడు కార్యచోదకుల సభనొండు నియమింతురు. ప్రతిభాగస్థుడును తన యామోదము రీతిని చోదకుల వరించు హక్కు గలవాడైనను, తనకు నాకార్య విషయమంతగా దెలియదుగావున, తొలుత స్థాపించినవారెవరిని - గోరుకొనిరో వారినే యుండనిచ్చుట మేలని తలయూచి యూరకుండుట స్వాభావికమేకదా? కావున చోదకులు భాగస్థులచే నియమింపబడెదరనుట పేరుమాత్రము. యాధార్థ్య