పుట:Bhaarata arthashaastramu (1958).pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవ ప్రకరణము

ఆధునిక వృత్తినిర్మాణములందలి సామాన్యలక్షణములు - విరర్గళస్పర్ధ

పూర్వకాలమున నాయాజాతివారు కులానుసారములగు పద్ధతుల నిర్వర్తించుచుండిరి. కాన నొకజాతి వారితో దదితరజాతుల వారు జీవనార్థమై స్పర్థించుట లేకుండెను. ఈ యాచారము మనదేశమున నింకను వినాశము నంతగా బొరయక నిలిచియున్నది. దీనిచే గలుగు కష్టనష్టముల నామూలాగ్రముగ బేర్కొన నాదిశేషునకైన వలను గాదు. శ్రీ కందుకూరి వీరేశలింగముగారు వాక్రుచ్చిన ప్రకారము.

"మనదేశమునం దాయావర్ణములవారే యా యా పనులను జేయవలయుననెడు నిర్బంధ ముండుటవలన నొక కుమ్మరి దంతపుపని యందెంత యభిలాషమును నేర్పును గలవాడయినను దానిని మాని కుండలనే చేయుచుండ వలయును, ఒక స్వర్ణ కారుడు వస్త్రములను రత్నకంబళములను నేయుట యందెంత యభిరుచియు బుద్ధియు గలవాడైనను వానిని వదిలి సుత్తితో వెండి బంగారములనే సాగగొట్టుచుండవలెను.............పనివాండ్రు స్వేచ్ఛముగా తమబుద్ధి ప్రవేశించిన పనియందు బ్రవేశించి తమసామర్థ్యమును కౌశలమును గన బఱచుటకు వలనుపడక తమకిష్టములేని పనులయందే విధిలేక యావజ్జీవమును గడుపవలసినవా రగుచున్నారు. అందుచేతనే యీ హిందూ దేశమునందు శిల్పాదివృత్తు లెప్పుడు నుండవలసినంత మంచిస్థితియం దుండకున్నవి."

ఱంపముతో గరగరమని పనిచేయువానిని మంగలకత్తితో సరళముగ గొఱుగుమన్న వెండ్రుకలకు జేటులేదు గాని ముక్కు మొగములకు జేటుదప్పదు ఇంకను విశేషించి ప్రసంగింపనక్కరలేదు.

జాతిభేదమువలని కీడులు

మఱియు బరస్పర మిశ్రములుగాని జాతిలేర్పడినచో వృత్తులన్నియు నుత్తమ మాధ్యమాధమములను రూఢిగాంచి యుత్సాహ