పుట:Bhaarata arthashaastramu (1958).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము

ప్రవేశకము

అర్థశాస్త్రము పాశ్చాత్య దేశముల యందును క్రొత్తదిగ నెన్నబడు చున్నది. అట్లగుట దీనిని గుఱించి వ్రాయుటయనిన మాచదువరులకు బొత్తిగా దూరమగు విషయమును ప్రదర్శించుట యగును కాని ఈ శాస్త్రసాహాయ్యములేక ప్రస్తుత కాలమున నాగరిక దేశముయొక్క జీవయాత్ర దుర్ఘటము. కాలమును స్థలమును అద్బుతవిధమున లోబఱచుకొన గలుగు రైలుమార్గములును, మహానావలును, టెలిగ్రాపు, టెలిపోను మున్నగు వార్తావహ యంత్రములును ఇంకను రానున్న విమానజాలమును అన్నియునుజేరి లోకము నంతటిని ఒక్క యింటివలె నొనర్చి యున్నవి. అన్నవస్త్రాదులు సమృద్ధిగ సమకూర్చుకొని వన్నెకలిగి జీవింపవలెనని ఎల్లజాతులవారికిని ఆశవొడమినది. " అదేశము అర్థవంతమై సంపద్యుక్తమై నెగడుచున్నదే ? మనదేశమేల ఇట్లు వలవంత లందుచుండవలెను ? సాధ్యమైనచో ఈ దుస్థితిని దొలగించుకొందము " అను తీర్మానము కొంచెము వెనుకబడి యుండు ప్రతిదేశముయొక్క పుత్రుల ఎడను కానవచ్చుచున్నది. ఈ తీర్మానము సఫలీకృతము చేసికొనుటకును నానాదేశముల యైశ్వర్య తారతమ్యంబు నెఱుంగుటకును మన మభివృద్ధి నొందుటకును అర్థశాస్త్రజ్ఞాన మవసరము.

గ్రంధ కర్త

అట్లగుట నీయర్థశాస్త్రమును మామండలికి వ్రాసియిచ్చుట కంగీకరించి శ్రమపడి మనదేశముయొక్క ఉపయోగమునకయి స్వతంత్ర గ్రంథమును రచించి యిచ్చినందులకు మ. రా. రా. కట్టమంచి రామలింగారెడ్డిగారిని అభినందించుచున్నారము. జగమెఱిగిన బ్రాహ్మణునకు జందెమేల ? వీరిని గుఱించి మేము పాఠకులకు పెంచిచెప్పనవసరమేలేదు. వీరు మానసిక సాంఘిక శాస్త్రములయందు ఈ దేశముననేగాక ఇంగ్లాండునందును కృషిచేసి జ్ఞానము సంపాదించి బహుసమర్థులయి బిరుదము లందినవారు. ఇక వీరిభాషాపాండిత్యమును అసామాన్యము. వీరు తెలుంగునను నుత్తమపరీక్షలలో నుత్తములుగ నుత్తీర్ణులై రనిచెప్పి విరమించినం జాలును.

అర్ధశాస్త్రభాగములు

లోకములోని సంపత్తంతయు అర్థమే. అర్థశాస్త్రమనునది లోకములో సంపత్తి ఎట్లుపుట్టునో ఎవరెవరు ఎట్లెట్లు దానిని అనుభవింతురో అట్టి అనుభవమునకు సాధనములేవియో విశదముగా విమర్శించును ఈ విషయములను బట్టియే అర్థశాస్త్రమున ముఖ్యభాగము లేర్పడియున్నవి. ఉత్పత్తికాండమనునది సంపదయొక్క పుట్టుకనుగుఱించి చర్చించును. విభజనకాండము అ పుట్టిన సంపద ఎవరిని ఎంత