కాదు, సమాధి నానందించు యోగీశ్వర తుల్యుండనినను దప్పులేదు. ఇట్లే ముక్తి, ఆత్మజ్ఞానము ఇత్యాది సిద్ధులు ధర్మనిరత చిత్తులను తమంతటవచ్చి చేరును. అర్థోదయమునట్లే. కేవల లోభబుద్ధుని ధనమునే యాకాంక్షించి పలవరించువారి దేశమున లక్ష్మి చిరకాల నివాసము జేయదు. ఐరోపావారు ధనపిశాచానిష్టులు గారనుటకు వారిఐశ్వర్యమే ప్రమాణము. ఇది వింతయైన పలుకుగ దోచునేమో! వివరించెద వినుండు. లోభులు ధనమును బాతిపెట్టి దీపముబెట్టుకొని కావలి యుందురేకాని ఇంకెన్నడో ఫలములనిచ్చిననిచ్చు నుద్యోగముల వినియోగింపరు. మూలధన ప్రయోగంబులేనిది ద్రవ్యములు విస్తరింపవు. ఈ ప్రయోగమునకు సాహసము ప్రేరేపక హేతువు. చూడుడు! వారు ఆశాహతులను కొందము. మన మాశలేనివారముకాముగదా? ఐన వారుమాత్ర మేల సర్వవిభవసమేతులై యుండుట? మన మష్టదారిద్ర్య తాడితులై మలయుట? నిజము చూడంబోయిన నాదికారణమొక్కటే. అయ్యది పౌరుషవంతులై నైజశక్తుల నిగ్రహించి దేశాభిమానము గ్రుంగనీక సత్యనిరతిగలిగి తమతేజంబును ప్రకటించిన సర్వసిద్ధులు కరతలామలకములౌట స్వాభావికము. పౌరుషహీనతయే మనదుస్థ్సితికి గారణము. కావుననేగదా ఇప్పుడు సుమారై నూఱు సంవత్సరములుగ కవిత్వము, తత్త్వశాస్త్రము, ప్రకృతిశాస్త్రము, శిల్పకళ ఇత్యాదుల యందెందును ఉత్కృష్టములైన కృతులెవ్వియు నీఖండంబున నుద్భవిల్ల కుంట? తత్పూర్వము ప్రాచీనులు ఈఅన్నిటియందును బ్రగల్భులై యుండిరి. ఏకాలమున మనవారు పౌరుషమే ప్రధానమనినమ్మి ఉక్కు తునకలట్లుండిరో ఆవీరయుగంబులైన భారతకాలాదులలో శత్రుభంజన క్రీడతోడ సర్వక్రీడలు, శాస్త్రములు ప్రబలివుండినవి. ఎప్పుడు బానిస తనంబు ప్రాప్తించి శత్రువులయు, దురాచారములయు, కనుసన్నల గ్రుక్కుమిక్కనక మెలంగవలసినవారమై మీసముల సింగారమున