పండితులైన యొకరు గొడ్డునేల యని త్యజింపబడిన భూములను ఈ యుక్తిచే సస్యాఢ్యములుగా జేసిరి. కొన్నిపంటలు తమకు వలయు ద్రవ్యములు గ్రహించినను ఇతర ధాన్యముల కనుగుణమైన ద్రవ్యముల నుత్పాదించునట. ఈరహస్యముల శోధించి వారు ఆయా పొలములకు సరియైన సస్యక్రమము నిర్దేశించి భూమికి వంధ్యత్వముం బాపి ప్రజలకు మహోపకారము గావించిరి.
పయిరులకును ఫలవృక్షములకునువచ్చు వ్యాధులు తన్నివారణ క్రియలు, వీనిశోధనలో ననేకులు పాటుపడుచున్నారు. వారిచే గనిపెట్టబడిన సంగతులను మన గవర్నమెంటువారు ప్రచురపఱచెదరు. మైసూరిలో పోకను బాడుజేయుచున్న పురువులను కొన్ని తైలముల జల్లి సంహరించుట ఇపుడు సర్వసాధారణముగనున్నది. టెంకాయచెట్ల చిగుళ్ళను దినివేయు పురుగులు, చీడ మొదలగు కీడులను దొలగజేయు సిద్ధులు ఇపుడు మనకు దెలిసినవిగాక యింకను నెన్నో యున్నవి. అమెరికాలో 'కాలిఫోర్నియా' యను సీమలో నొక మహామహుడు అంట్లుగట్టుట, సంకరములు గల్గించుట వీనిలో బహు కుశలియై గింజలులేని నారింజలు, తిత్తిరీతిని క్రిందిభాగమున నొకటి యేర్పడి అందులో గింజలన్నియు నడగియుండెడు నారింజలు. పుల్లదనము తీపియు వేర్వేరు భాగములనుండు బేరిపండ్లు, ఇట్టి చిత్ర విచిత్రముల నెన్నియో కల్పించినాడని ప్రసిద్ధిగలదు.
మాంసభక్షణము
అమెరికావారు మనలంజూచి చుఱుకుదనము లేనివారనియు, అసాహసికులనియు, తమమేలు నెఱిగి తద్విధమున వర్తింప శ్రద్ధా జ్ఞాన ధైర్యములు లేనివారనియు గర్హించి పలుకుదురు. నేను కార్నెల్ సర్వకళాశాల దర్శింపబోయినపుడు హిందూదేశమున యాత్రజేసిన అర్థశాస్త్రపండితుండౌ 'జెంక్సు' గారిని జూచి మాట్లాడ బ్రస్తావవశంబున నతడు "మాంసవిసర్జనమున మీకు