Jump to content

పుట:Baarishhtaru paarvatiisham.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పోనీ మన బోటివాళ్ళే వాళ్లూను. నాపెట్టెలో ఎక్కినందువల్ల నాకు వచ్చిన నష్టమేమీ లేదు. గార్డుకిచ్చిన రూపాయి తప్ప. అయినా ఎక్కినవాళ్ళు ఏ తెలుగువాళ్లో అయితే కాస్త మాటా మంచీ ఆడడానికీ, కష్టమూ సుఖమూ చెప్పుకోడానికి వీలుగా ఉండేది; అదేదీ లేకుండా, కలలోకి వచ్చేరూపూ, గ్రామసింహములు వాదించు కుంటున్నట్లు సంభాషణా వీళ్ళూనూ. ఈ అరవ వాళ్ళు వచ్చారేమా అని మట్టుకు మహా కష్టముగా ఉంది నాకు, చెప్పవద్దు మరి.

ఇంతట్లోకే రైలు బయలుదేరడానికి గార్డు ఈలవేశాడు. ఈ వచ్చిన నలుగురైదుగురిలోనూ ఆఖరునవచ్చి నాయన ఒక్కడే లోపలికి వచ్చాడు. తక్కినవాళ్ళంతా ఊరికే ఈయన్ని సాగనంపడానికి వచ్చినట్టు తోస్తుంది. ఒక్కడే అయినప్పుడు ఆయనలో ఆయన మాట్లాడుకోలేడు గదా. మాట్లాడితే నాతో మాట్లాడాలి. లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవాలి. అందుచేత ఎలాగైనా, ఫరవాలేదనుకున్నాను.

రైలు బయలుదేరింది. చాలాదూరము వరకూ, చిన్న చిన్న స్టేషన్లు దగ్గిర దగ్గిరలో చాలా ఉన్నాయి. అక్కడెక్కడా రైలు ఆగలేదు. రైలాగనప్పుడు మధ్యనిన్ని స్టేషన్లు ఎందుకు కట్టారా అనుకొన్నాను. పెట్టెలో కూర్చున్నాయన నడుగుదా మనుకుని, ఇదివరకే పల్లెటూరు దద్దమ్మన్నాడు. ఈ ప్రశ్నవేస్తే యింకా ఏ మంటాడో అనుకుని ఊరుకున్నాను. కాని చెన్నపట్నము పొలిమేరెక్కడో మట్టుకు చెప్పండని కోరాను.

ఈ చిన్న చిన్న స్టేషను లన్నీకూడా చెన్నపట్నములో చేరి