Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని, ఋషివాటిక లంతరించాయి, మునిబాలకులూ అపురూపం అయిపోయారు, యీ వృత్తులూ అంతరించిపోతున్నా యిప్పుడు.

జాతి శీలమే మారిపోతోంది, మంచికో చెడ్డకో

15

మొత్తానికి, నాలుగు పొరుగూళ్ళలో చదువుకున్నా న్నేను.

నాలుగుచోట్లా వారాలే చేసుకున్నాను.

భోజనం సందర్భంలో రెండుచోట్ల విచిత్రానుభవాలు కలిగాయి, నాకు.

మొదటిది వల్లూరుగ్రామంలోనే తటస్థించింది.

ఆ వూళ్లో వైదికుల్లో చేబోలువారూ, నియోగుల్లో బెండపూడివారూ అధిక సంఖ్యాకులని చెప్పివున్నాను.

ఎందరికయినా, వారూ వీరూ మాత్రమే వారా లిచ్చేవారు.

ఆ వూళ్ళో బులుసువారిది వొక్కటే కుటుంబం, ఆ యింటి యజమాని సుబ్రహ్మణ్యంగారున్నూ వారా లిచ్చేవారు.

ఉండినంతకాలమూ నాకు బసకూడా యిచ్చారు, వారు.

ఒకమాటు, అటు చేబోలువారికీ యిటు బెండపూడివారికీ జాతాశౌచమృతాశౌచాలు వచ్చా యేకకాలాన.

సంధిదినాలు రెండు.

లెక్కకి రెండే కాని, మా విద్యార్థులకవి, దినాలు కాక, వారాలూ మాసాలూ కూడా కాక, సంవత్సరా లయిపోయాయి.

నామట్టుకి నాకు “ఇక యిక్కడ చదువు సాగదా?" అన్నంత గడ్డుదినా లయిపోయా యవి.

ఆ రెండు దినాలూ గడిస్తే, మామూలుగా అన్నం సమృద్ధే, సందేహం లేదు.

తక్కిన యిళ్ళవారిని ప్రాధేయపడి లాభం లేకపోగా, యిద్దరు విద్యార్థులు, దగ్గిరే వున్న స్వగ్రామం నరిసిపూడి వెళ్ళిపోయారు.

తర్కవిద్యార్థి, మండపేటలో కాలక్షేపం చేసి వస్తానని వెళ్ళి, యెక్కడో పస్తుపడివుండి, జామురాత్రి అయాక వచ్చి, కడుపులో కాళ్లు పెట్టుకుపడుకుని మొదటి దినం గడిపాడు.

స్కూలుమాష్టరు సంగతి తెలియదు; గాని నేను మిగిలాను.

ఇంటికి వెడదా మంటే యేడెనిమిది మైళ్లు వెళ్ళాలి. రావాలి.

వెడితే మరో రెండు రోజులయినా వుంటేగాని స్నేహితులు విడిచిపెట్టరు, చదువు చెడుతుంది.

ఇదంతా ఆలోచించి ఎటూ పాలుపోక నేను తటపటాయిస్తూ వుంటే, తమ యింటోనే భోజనం చెయ్య మన్నారు, గురువుగారు నన్ను.

గురుపత్ని శేషమ్మగారు “నాయనా, మొగమాటపడకు” అనే అన్నారు గాని; నా కది యిష్టం లేకపోయింది.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 1

41