Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/580

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ ద్రోణంరాజు నరసింహారావుగారు, పానుగంటి నరసింహా రావుగారి అల్లుళ్లు.

వారూ, పానుగంటి నరసింహారావుగారి సోదరులు సుబ్బారావుగారూ కూడా అక్కడ వుండగా వచ్చిందీ ప్రస్తావన.

నేను వెళ్ళాటప్పటికి, వంగూరి సుబ్బారావుగారు, పానుగంటి వారి సారంగధర నాటకం విశిష్టత వివరిస్తున్నారు.

ఆ పుస్తకం వారిచేతిలోనే వుందప్పుడు.

అప్పటి క్కొద్ది మాసాలక్రితమే అచ్చుపడివుంది, నా రచనా.

"మీ కొత్తనవల చదివానండీ" అంటూ సుబ్బారావుగారే తెచ్చారు, దాని ప్రస్తావన.

వారు "మీ... కొత్త నవల-" అంటూ ప్రారంభించారు ఆ వాక్యం.

"మీ..." అంటూ అప్లుతం వుచ్చరించడంలో వారు, తమ మాట చాలా జాగ్రత్తపడుతున్నట్టు స్పష్టంగానే తెలిసింది.

సాధారణంగా "మీ శ్మశానవాటిక చదివానండీ" అనడం లేకపోలేదు చాలా మంది.

తప్పేం, నా రచనపేరే అదయి వున్నప్పుడు?

రచయిత తన రచనకు పేరు పెట్టడంలో యెంతో ఆలోచిస్తాడు.

మంచి చెడ్డలతోపాటు - అందచందాలతో పాటు - సార్థకత కూడా చాలా ఆలోచించుకుంటాడు.

ఇక, ఆ పేరుచ్చరించడంలో, విరుపులు విరవడమూ, శ్లేషలు తియ్యడమూ - ఇవి, అవతలివాళ్ళ బుద్ది జాతినిపట్టి వుంటుంది.

పూర్వకవుల కంతగాలేనిది, నవీనులకు, తమ రచనలకు పేర్లు పెట్టడంలో కొత్త అభిరుచు లేర్పడ్డాయి.

అవి యింగ్లీషు చదివినవారు, ఇంగ్లీషు రచనలను చూసి అలవర్చుకున్నవి.

క్రమంగా, ఇంగ్లీషు నేర్వని మనవాళ్ళు-నావంటి వాళ్ళున్నూ ఆ మార్గం తొక్కుతున్నారు ధారాళంగా.

అయితే, యీ కొత్త సంప్రదాయం అనుసరించి పెట్టిన పేర్లలో, కొన్ని గ్రంథకర్తపేరితో కలిపి పలికితే, కొన్ని విపరీతార్థాలు స్ఫురించడం వుంది.

అయినా, వారా పద్ధతి మానడంలేదు.

ఇది నాకు, వెనకటివా రెందరో తొక్కిన మార్గం.

ఇటీవలి వారీ మార్గమే తొక్కుతున్నారు, బహుళంగా.

ఇక్కడ, కొందరు గ్రంథకర్తల పేర్లతో కలిపి, కొన్ని నవీన గ్రంథాల పేర్లుదహరిస్తాను.

1. వీరేశలింగంగారి 'అభాగ్యోపాఖ్యానం'

2. గురజాడ అప్పారావుగారి 'కన్యాశుల్కం'

3. ఉన్నవ లక్ష్మీనారాయణగారి 'మాలపల్లి'

4. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి 'పాణిగృహీత'

5. మళ్ళీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి 'శనిగ్రహం’

556

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.