Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/576

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీపాద నరసింహశాస్త్రిగారని వొక పండితులు.

గొప్ప పండితులు.

విశేషించి, ఆయుర్వేదాశ్రమాస్థాన పండితులు వారు.

వారంటే, యెంతెంతో ఆదరాభిమానా లాచార్యులుగారికి.

వారి సాహచర్యం వల్లనే "ఈ శ్రీపాదవా రెవరు?" అనడం ఆచార్యులుగారు.

పశ్చిమ గోదావరిజిల్లా లొల్ల గ్రామం నరసింహశాస్త్రి గారిది.

మాకూ మాకూ జ్ఞాతిత్వం లేదు; కాని, వారి అత్తవారి పరంగా బంధుత్వం మాత్రం వుంది.

అయితే, మద్రాసులోనే వారితో నాకు పరిచయం.

రెండు నిమిషాల్లో నా సంగతి చెప్పుకున్నా నాచార్యులు గారితో.

“ఇక్కడ కాదు, రండీ" అంటూ వెంటనే తమ ఆఫీసు గదిలోకి తీసుకు వెళ్ళా రాచార్యులుగారు, నన్ను.

మరో రెండు నిమిషాలు కూచున్నారు నా కోసం.

అక్కడే అందించాను వీరపూజ, వారిచేతికి.

పుచ్చుకున్నా రంతే, మాట్టాడలేదు, పుస్తకం విప్పారు.

పద్మినీదేవిని చెరపట్టడానికి వచ్చిన అల్లావుద్దీనుకి మేవాడు రాణాలు స్వాగత సత్కారాలు చెయ్యడమూ, తనని సాగనంపేటప్పుడా అల్లాఉద్దీనే పద్మినీదేవిని, భర్తను పట్టెయ్యడమూ, ఆ సందర్భంలో నేను మన వాళ్ళ నీతిని విమర్శించడమూ--ఈ ఘట్టం వచ్చింది, వారది తెరిచాటప్పటికి.

అది పూర్తిచేసేదాకా నా కేసి చూడలేదు వారు.

“భేష్" అన్నారు పూర్తిచేసి.

“మంచి విమర్శ. కొత్త వ్యాఖ్యానం. సరిఅయిన దృక్పథం మీది” అన్నారు.

"ఏమిటి మీరు వచ్చినపని?" అని అప్పుడడిగారు నన్ను.

అంతా చెప్పాన్నేను, టూకీగా.

“నాగేశ్వరరావుగారే చెల్లించ మన్నారాబిల్లు?" అనడిగారు వారు.

“అవు”నన్నాన్నేను.

వింతగా చూశారు నాకేసి వారు.

"ఏమయినా, వారనవలసినమాట కాదది. దానికేం, భారతవీరుల చరిత్ర కావాలి నాకు. మీరు రాస్తేనే బాగుండేటట్టుంది" అన్నారు.

“ఇంత అని పరిమితి వద్దు. ఎన్ని అయితే అన్నీ రాయండి, నా ప్రెస్సులో అచ్చువేయించి వుచితంగా యిచ్చేస్తాను మీకు. కాగితం ఖరీదు కూడా నేనే పెట్టుకుంటా" నని కూడా అన్నారు.

వారి వాఙ్మయప్రీతీ, వారి విషయ నిర్ణయమూ, నా యెడల వారి క్కలిగిన ఆదరభావమూ, వారి మహౌదార్యమూ - ఇవి గుర్తించి చకితుణ్ణయిపోయా న్నేను.

నాకున్నదే ఆ వుద్దేశం.

ముందు వీరపూజ రాయడావి కదే కారణం నేను.

దాల్లో చెయ్యి తిరుగుతుంది నాకే కొంచెమయినా.

552

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.