Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/570

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆ అనుభవం పురస్కరించుకునే చాణక్యాదులు కొత్త సంప్రదాయాలు నెలకొల్పారు. ఆ వాదం అంగీకరించారు మీరు, నాగేశ్వరరావుగా రంగీకరించ లేక పోయా రది" అన్నారు వారు, మొదట.

“అయితే, వీరపూజ అచ్చువేయించి యివ్వడానికి మాత్రమే నాగేశ్వరరావుగారికి పూనిక. మీ రచనలో లేశమూ లేదు, వారికి ప్రమేయం వారి యిష్టానికీ అనిష్టానికీ గూడా అతీతం మీ రచన. అంచేత, మీ రచన విమర్శించడానికీ ఖండించడానికీ మాత్రమే వారి కధికారం. మీ స్వేచ్ఛకు అడ్డు తగలడంలో, తమ ధనికత పురస్కరించుకుని వారు కొంత తప్పుదారి తొక్కారనే చెప్పాలి" అన్నారు తరువాత.

"మీ రచన సమర్థించడంలో భానుమూర్తిగారు కనబరిచిన ఔదార్యమూ, ఔచిత్యమూ చాలా స్తవనీయాలు" అని వొప్పుకున్నారీ కారణం పురస్కరించుకుని.

"అయితే, వొకటుంది. "అయితే, చాణక్య ప్రభృతులగునప్పటి రాజనీతిజ్ఞుల దృష్టిలో, రాజనీతి ప్రవృత్తి యిట్టిదని నిర్వచించుటకు వలనుపడదు” అని నాగేశ్వరరావుగారి సవరణ. అగతికమైన స్థితిలోనే మీ రచనలో మీ రా సవరణ చేర్చుకున్నారు మీరు, సందేహం లేదు. ఈ కొత్త సంప్రదాయం ప్రారంభించినవారు మీరు కారు. మన పూర్వులే - చాలా చాలా పూర్వులే మిక్కిలీ సమర్థులయినవారే చేశారావని. నాగేశ్వరరావుగారే యిది అంగీకరించారు. అయితే, తాము పాత సంప్రదాయం అంగీకరించేటట్టే, మీ రెందు కంగీకరించగూడదూ కొత్త సంప్రదాయం? ఈ జిజ్ఞాస కలగలేదని మాత్రమే చెప్పాలి వారికి" అని నిర్ధారణ చేశారు, దృఢంగా.

"చివరికి తేలిందేమిటీ? విదేశీయులతో ఘర్షణవచ్చినప్పుడు, మనవాళ్ళ క్కలిగిన కొత్త అనుభవంతో, మనవాళ్ళే ప్రారంభించిన కొత్త సంప్రదాయం సమర్థించడం మీ పూనిక అయితే, అంతకిముందు, నాగేశ్వరరావుగారు, మన అసలు సిద్ధాంతం బాగా వివరించమని మిమ్ము కోరి వుండవలసింది. తరవాతే కొత్త సంప్రదాయం బలపరుచుకోమనీ కోరి వుండవలసింది. మీ రయినా చేసి వుండవచ్చు స్వయంగా అది, మీ తప్పు కాదు. కాని మిమ్మల్నందుకు నిర్బంధించడం మాత్రం ధర్మం కాదెవరికీ," అని వొప్పుకున్నారు కూడా.

“అయితే, ఆ కొత్త సంప్రదాయం అంగీకరించడం మాత్రం తప్పనిసరి అయింది నాగేశ్వరరావుగారికి. ఇదీ వారు చేసిన సవరణ ఆంతర్యం" అని నిర్ధారణ చేశారు, చివరికి, వారు.

ఇది నాకు విజయమా అపజయమా? పోనీ, నేను భానుమూర్తిగారి సలహా అంగీకరించడం తప్పనడమా యిది, వొప్పనడమా?

“మరి, కనక?” అనడిగాన్నేనీ జిజ్ఞాసతో, వినివిని.

చూశారు చూశారు లక్ష్మణరావుగారు.

నా పట్టుదల గుర్తించారు.

బహూ సమర్థులు వారు.

నిండుకుండ.

ఎలాంటి ఘర్షణా కూడా అతి తెలివిగా చల్లబరచగలవారు.

546

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.