Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/559

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మద్రాసు కచేరీల్లోనూ, షాపుల్లోనూ, కంపెనీల్లోనూ పని చేసేవారు, చాలామంది, మద్రాసులోనేకాదు, చెంగల్పట్టు దాకా స్టేషనున్న వూళ్ళలో కాపరం వుంటారు.

ఇప్పటికీ యింతే యిది.

వారికోసం యేర్పడ్డవే ఆ రెయిళ్ళు.

ఆవిరి రెయిళ్ళకు బదులు, మెరుపు రెయిళ్ళు నడుస్తున్నాయిప్పుడు.

సాయంకాలమున్నూ, వొకటి తరవాత వొకటిగా చెంగల్పట్టు వెడతా యవి.

ఇప్పుడు సంఖ్యా యెక్కువయింది, వేగమూ యెక్కువయింది ఆ రెయిళ్ళకు.

ఫోర్టు స్టేషన్నుంచి, సైదాపేటకు అయిదు కానుల టిక్కట్టప్పుడు.

భానుమూర్తిగారితో కలిసి సాయంత్రం సైదాపేట వెళ్ళి, భోజనం చేసి, ఉదయమున్నూ భోజనం చేసి, వారి తమ్ముడు గారితో కలిసి మళ్ళీ మద్రాసు వచ్చేవాణ్ణి నేను.

డబ్బు ఖర్చు తగ్గడంతోపాటు, భానుమూర్తిగారి యింట చక్కని భోజన సుఖమున్నూ యేర్పడింది నాకు.

సైదాపేట వెళ్ళేటప్పుడూ వచ్చాటప్పుడూ కూడా ప్రతీ రెయిల్లోనూ జీతగాళ్ళదే ప్రాముఖ్యం.

వారి చిత్తవృత్తి అదో ప్రపంచం.

తక్కినవారిలో, మళ్ళీ తక్కినవారిమాట యేమయినా, చాలీచాలని జీతాలతో ఆ బహు సంఖ్యాకుల చిత్తవృత్తిలాగే, ఉండీ ఉండని డబ్బుతో నా చిత్తవృత్తిన్నీ ఘూర్ణితం అయిపోతూ వుండేది.

ఇలాగ, రమారమీ రెండు మాసాలు గడిచింది, నాకు.

ఈ రెండు మాసాల్లోనూ వీరపూజ అచ్చు ముగిసిపోయింది.

ఏమనుకున్నారో, ఆ రెండుమాసాల్లోనూ, నా రచన విషయమై సవరణలూ సూచించలేదు, చర్చలూ సాగించలేదు నాగేశ్వరరావుగారు.

భానుమూర్తి గారు నన్నెంతో ఆదరించారు. సోదరప్రేమతో.

కాని, ఉన్నట్టుండగా వారి భార్యకు జబ్బు చేసింది.

భానుమూర్తిగా రామెని పుట్టింట దిగబెట్టి వచ్చారు.

మళ్ళీ హోటలు భోజనం చెయ్యవలసి వచ్చింది, నాకు మద్రాసులో.

28

తిరువల్లిక్కేణి-తాండవరాయ మొదలివీధి - 31వ నెంబరు మేడమీద తెనుగు విద్యార్థుల వొక లాడ్జి.

కింది అంతస్థులో వొక తెనుగు హొటలున్ను.

బి.ఏ. ఆనర్సు చదువుతూ మా పింతల్లి కొడుకొకడూ, ఇంజనీరింగు కాలేజీలో చదువుతూ మా మరో పింతల్లి అల్లుడొకడూ వుండేవా రా లాడ్జిలో.

అప్పుడూ అప్పుడూ వారిని చూడ్డానికి వెడుతూ వస్తూ వుండడంలో అక్కడి విద్యార్థులందరితోనూ బాగా పరిచయం యేర్పడింది, నాకు.

అనుభవాలూ - జ్ఞాపకాలూను - 3

535