ఆ మనిషి కర్థం కాలే దిది.
పోనీ అని వూరుకోవచ్చా, "చెప్పినధరకి బేడతక్కువ చేసుకోం" డన్నాడు. "మీరు కనక, పోనీ పావలా తగ్గించు కోండి" అన్నాడు కూడా.
అసలే చిరాగ్గా వున్న శాస్త్రిగారికి మంట వచ్చింది, దీంతో.
కాని, గంభీరంగా చూస్తూ - చల్లగానే - "మరి తులం యెంతకిస్తా" వనడిగారు శాస్త్రిగారు.
తెల్లపోయాడు గడ్డిమనిషి, దీంతో.
నవ్వాపుకోలేకపోయా న్నేను, దానా దీనా.
"ఏం నవుతారేం? పట్టుకుచ్చులు తులాలలెక్క నేగా అమ్ముతారు?" అనడిగారు శాస్త్రిగారు.
అదిగో, ఆ మల్లయ్య శాస్త్రిగారి శిష్యులు, కర్రా వారు.
పది నిమిషాల్లోనే సన్నిహితులం అయిపోయాం మేము, దీంతో.
నేనడగ్గా "చెప్పవలసిం దేమీలేదు. ఆంధ్రపత్రిక బొంబాయిలో వుండినప్పణ్ణుంచీ పనిచేస్తున్నా న్నేనీ ఆఫీసులో. పంతులుగారి మనస్సులో యేమివుంటే అదే బయటికి వస్తుంది, మాటలరూపాన. బయటికివచ్చిన మాటకూడా యథాతథంగా జరిగి పోతుంది. దంభం లేదు వారిదగ్గర, టెక్కూ, దాపరికాలూ లేవు. మాయ అన్నది అసలే లేదు. కాని, సమయం గుర్తించుకోవాలి. కనిపెట్టుకునిన్నీ వుండాలి, కొన్నాళ్ళు, అంతే" అని చెప్పారు లక్ష్మీనరసింహంగారు, పంతులుగారి విషయమై.
అప్పటికయిదు కాగా, పంతులుగారి గదిలోకి వెళ్ళాన్నేను.
అప్పుడే వచ్చి కూచుంటున్నారు, వారు.
మళ్ళీ పుస్తకం చేతి కిచ్చాను.
ఎవరో వచ్చి కదిపేదాకా పుస్తకం అంతా తిరగవేశారు వారు, పేజీ అరపేజీ చొప్పున చదువుతూ.
వారు పుస్తకం కిందపెట్టాక మాట్టాడదా మనుకున్నాన్నేను.
కాని, ఉన్నట్టుండగా, యిద్దరు పెద్దమనుష్యు లెవరో వచ్చి "రావలసినవా రందరూ వచ్చారు" అని చెబుతూ దగ్గిర వుండి పంతులుగారిని “దయచెయ్యాలి” అంటూ కూచున్నారు.
అదృష్టవశాన నొక గుమాస్తా నుంచుని వున్నా డక్కడ, పంతులుగారి సావధానతకోసం చూస్తూ.
ఆయన, జీతంలో కొంత అడ్వాన్సు ఇమ్మని అడగడమూ, పంతులుగా రాయనికి స్లిప్పు రాసియివ్వడమూ క్షణంలో జరిగిపోయాయి.
ఇంతలో నేను కనబడ్డాను, వారికి.
"వీరికి బస చూపించు” అని ఆ గుమాస్తాతో చెబుతూనే, వచ్చిన పెద్దమనుష్యులతో వెళ్ళిపోయారు, వారు.
ఒక మూలగది చూపించాడు నా కా గుమాస్తా, తానే నా ట్రంకు పుచ్చుకుని బయలుదేరి.
"మీ రిక్కడ స్వేచ్ఛగా వుండవచ్చు నెన్నాళ్ళయినా" అని కూడా చెప్పారు.
510
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.