Jump to content

పుట:Anubhavalu Jnapakalunu by Sripada Subrahmanya Sastri.pdf/528

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరస్వతీ పీఠం అది.

అగ్రహారీకుల వంశంలో అని వొక బ్రాహ్మణ్యులు.

గొప్ప విద్వాంసులు వారు.

అపార పాండిత్యం వారిది.

బహు ముఖమున్నూ అది.

వారున్నూ ప్రామాణికులు.

వేదవాక్యం మరి, వారిది.

ఒకప్పుడు రాజసభలో వొక ధర్మసందేహం వచ్చింది.

పెద్దాపురంలో - రాజసన్నిధిని వున్న పండితు లది తీర్చలేక పోయారు.

ఎక్కడెక్కణ్ణుంచో - యెందరెందరో వచ్చారు పండితులు - వారూ తీర్చలేకపోయారు.

మహారాజుకి తదేకదృష్టి.

తమ పండితుల్లో అది తీర్చగల పండితుల్లేకపోయారే అని బెంగ వారికి.

కాక, - అది తీరితేనే రాజధర్మ ప్రవృత్తి.

ఆలోచించి - చర్చించి "వింజరం అగ్రహారంలో వున్న......గారు మాత్రమే తీర్చగల రది" అని మనవి చేసుకున్నారు, సన్నిహితులు, ప్రభువుకి.

పదహారుగురు బోయీల పాలకీ, పరివారమూ పంపాడు మహారాజు శాస్త్రిగారికోసం, అవ్యవధానంగా.

శ్రమపడి వెళ్ళి, దరఖాస్తు పంపుకుని, కిందివారిచుట్టూ తిరుగుతూ పడిగాపులు పడివుండడం కాదు, పండితుల అవస్థ అప్పుడు.

వర్తమానంచేసి, దర్శనంకోరి. పాలకీ పరివారమూ పంపి ప్రభువులే యెదురు చూసేవారు పండితులకోసం, అప్పుడు.

సభ కూడింది.

విషయ వివరణమూ, చర్చా జరిగాయి.

విని విని, సిద్ధాంతం ప్రకటించారు, శాస్త్రిగారు.

బృహస్పతి తీర్పది.

అందరూ చకితులైనారు.

పండితు లానందించారు.

ప్రభువు సత్కారం తలపెట్టాడు శాస్త్రిగారికి.

కాని విముఖత చూపించారు శాస్త్రిగారు.

"ఈ కొత్త సత్కారం యేమి చేసుకోను ప్రభూ? ఇప్పుడు లోటేమిటీ నాకు? అన్యత్రా వినియోగం చేయించండి" అని మనవి చేసుకున్నారు, శాస్త్రిగారు.

ఎందరికో జరుగుతూనే వున్నాయి రాజసత్కారాలు, దినమ్మూ .

మరి, అంతటి పండితులు శాస్త్రిగారి నెలగా విడిచి పెట్టడం?

అనేకవిధాల కోరాడు ప్రభువు "స్వీకరించవలసిం" దని.

మెట్టు దిగవలసి వచ్చింది, శాస్త్రిగారికి.

"ప్రభూ" అన్నారు వారు.

504

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.